Thalapathy Vijay: విజయ్ పరిహారాన్ని తిప్పి పంపిన కరూర్ తొక్కిసలాట బాధితురాలు.. కారణం ఏం చెప్పిందో తెలుసా?
గత నెలలో తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషాద ఘటనకు టీవీకే అధినేత విజయ్ నిర్లక్ష్యమే కారణమని కొందరు వాదిస్తుండగా, టీవీకే అభిమానులు, కార్యకర్తలు మాత్రం తమిళనాడు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ఓ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట అందరినీ తీవ్ర దిగ్భ్రాంఇకి గురిచేసింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ ఘటనలో మొత్తం 41 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. హీరో, టీవీకే అధినేత విజయ్ పై విమర్శలు కూడా వచ్చాయి. దీనికి తోడు కరూర్ బాధితులను విజయ్ పరామర్శించలేదన్న నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ సంఘటనపై సానుభూతి వ్యక్తం చేసిన విజయ్ 41 మంది బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల పరిహారం అందించాలని నిర్ణయించారు. దీని ప్రకారం, ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. తదనంతరం, ఆయన బాధిత కుటుంబాలను చెన్నైకి తీసుకువచ్చి నేరుగా మాట్లాడారు. అయితే విజయ్ పంపిన ఈ పరిహారాన్ని ఓ బాధితురాలు తిప్పి పంపిన వైనం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.
కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారిలో ఒకరైన కోడంగిపట్టికి చెందిన రమేష్ భార్య సంగవి, విజయ్ ఇచ్చిన రూ.20 లక్షలను తిరిగి ఇచ్చింది , “కరూర్ తొక్కిసలాటలో నా భర్త మరణించాడు. విజయ్ నేరుగా వచ్చి మమ్మల్ని ఓదారుస్తారని వీడియో కాల్లో మాట్లాడారు. ముందుగా ఆర్థిక సాయం తీసుకోవాలని చెప్పాడు. మేం విజయ్ పరామర్శ కోసం ఎదురుచూస్తున్నాం. విజయ్ ఆహ్వానించిన సమావేశానికి వెళ్లలేదు. కానీ, మా పేరు వాడుకొని మా బంధువులు ముగ్గురు సమావేశానికి వెళ్లారు. ఫలితంగా, నా ఇష్టానికి వ్యతిరేకంగా విజయ్ నా బ్యాంకు ఖాతాలో వేసిన రూ. 20 లక్షలను నేను తిరిగి ఇస్తున్నాను. ఈ నగదు చెల్లింపు గురించి కూడా మాకు ఎవరు సమాచారం తెలియజేయలేదు. తెలియజేయలేదు. మాకు డబ్బు ముఖ్యం కాదు. గౌరవం ముఖ్యం’ అని సంఘవి చెప్పుకొచ్చింది.
తొక్కిసలాట బాధితుల కుటుంబాలను విజయ్ స్వయంగా కలిసి ఓదార్చకపోవడం వివాదాస్పదమవుతోంది. ఇంతలో విజయ్ ఇచ్చిన రూ.20 లక్షల పరిహారాన్ని ఒక మహిళ తిరిగి ఇచ్చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








