క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ నష్టమే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
భారతీయ క్రిప్టో మార్కెట్ 2.6 బిలియన్ డాలర్లతో వృద్ధి చెందుతున్నా, 2026లో పెట్టుబడిదారులకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రీసెర్చ్ లేని పెట్టుబడులు, అంతర్జాతీయ క్రిప్టో చోరీల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. పన్ను నిబంధనల పాటించడం, ఎక్స్ఛేంజ్ సేఫ్టీ చెక్ చేయడం, మోసపూరిత హామీలకు దూరంగా ఉండటం, అధిక రిస్క్ ట్రేడింగ్ నివారించటం వంటి జాగ్రత్తలతో పెట్టుబడులను సురక్షితంగా ఉంచుకోవచ్చు.

భారతీయ క్రిప్టో మార్కెట్ 2024లో సుమారు 2.6 బిలియన్ డాలర్ల విలువను నమోదు చేసింది. రాబోయే పది సంవత్సరాల్లో ఈ రంగం భారీ వృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వృద్ధిలో చిన్న పట్టణాలు, గ్రామాల్లోని పెట్టుబడిదారులు రీసెర్చ్ రిపోర్టులకు బదులుగా కేవలం వాట్సాప్ ఫార్వర్డ్లు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా మాత్రమే సమాచారాన్ని తెలుసుకుని పెట్టుబడులు పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.
వృద్ధి వెనుక పెరిగిన ప్రమాదాలు
ఒకవైపు మార్కెట్ విస్తరిస్తున్నప్పటికీ.. మరోవైపు క్రిప్టో చోరీల ముప్పు పెరుగుతోంది. 2025 మొదటి ఆరు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 2.17 బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో చోరీలు జరిగాయి. ఈ దాడులు ప్రధానంగా ఎక్స్ఛేంజ్ హ్యాకింగ్లు, ప్రోటోకాల్ లోపాల వల్ల సంభవించాయి. అందుకే భారతీయ పెట్టుబడిదారులు 2026లో ఈ ప్రమాదాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. క్రిప్టోను హై రిస్క్ ఫైనాన్షియల్ ఉత్పత్తిగా పరిగణించి జాగ్రత్తగా వ్యవహరించాలని జియోటాస్ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ సూచిస్తున్నారు.
క్రిప్టో ఇన్వెస్టర్లు 2026లో తప్పక పాటించాల్సిన 5 జాగ్రత్తలు:
పన్ను నిబంధనలు ఖచ్చితంగా పాటించండి
భారత ప్రభుత్వం 2022లో ప్రవేశపెట్టిన క్రిప్టో పన్ను విధానం ప్రకారం.. లాభాలపై 30శాతం పన్ను విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ట్రేడ్పై 1శాతం TDS కూడా కట్టాలి. పెట్టుబడిదారులు 2026లో ప్రతి లావాదేవీని ఖచ్చితంగా నమోదు చేసి ప్రభుత్వ నియమాలకు కట్టుబడి ఉండాలి. విదేశీ ఎక్స్ఛేంజ్ల ద్వారా ట్రేడింగ్ చేయడం తలనొప్పులు కలిగిస్తుందని, నిబంధనలు పాటించని వాటిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సుబ్బురాజ్ హెచ్చరిస్తున్నారు.
ఎక్స్ఛేంజ్: భద్రత తనిఖీ చేయండి
మీరు ఎంచుకున్న క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఎంత సురక్షితంగా ఉందో తెలుసుకోవాలి. ఎక్స్ఛేంజ్లు తమ ఆస్తుల రక్షణ ఆధారాలను ప్రచురిస్తున్నాయా? ఎక్కువగా నిధులు కోల్డ్ స్టోరేజ్లో ఉంచుతున్నాయా? భద్రతా సమస్యలు ఎదురైనప్పుడు వారు ఎలా స్పందించారు? వంటి విషయాలను తెలుసుకోవడం వల్ల డబ్బు దోపిడీ ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.
చిన్న మొత్తాలతో సెల్ఫ్ కస్టడీని అర్థం చేసుకోండి
కొంతమంది నిపుణులు సెల్ఫ్ కస్టడీ వాలెట్లను ఉపయోగించడం సురక్షితం అంటారు, ఎందుకంటే ఎక్స్ఛేంజ్ హ్యాకింగ్ ప్రమాదాలు తగ్గుతాయి. కొత్త ఇన్వెస్టర్లు మొదట చిన్న మొత్తంతో నియమాలు పాటించే ప్లాట్ఫామ్ల ద్వారా ట్రేడింగ్ ప్రారంభించి, ఆ తర్వాత కొంత భాగాన్ని సెల్ఫ్ వాలెట్లోకి మార్చడం ద్వారా రక్షణపై అవగాహన పెంచుకోవచ్చు.
గ్యారంటీడ్ లాభాలు
మార్కెట్లో పెద్ద మార్పులు సాధారణం కాబట్టి ఫిక్స్డ్ రిటర్న్స్ లేదా గ్యారంటీడ్ లాభాలు అని ప్రకటనలు చేసేవారికి దూరంగా ఉండాలి. ఇవి ఎక్కువగా స్కామ్లు అయ్యే అవకాశం ఉంటుంది.
అధిక రిస్క్ – లెవరేజ్ ట్రేడింగ్కు నో
అర్థం కాని వాటిలో పెట్టుబడులు పెట్టడం, ఎవరో చెప్పారని భారీగా ఇన్వెస్ట్ చేయటం మానుకోండి. మీ మొత్తం సంపాదనలో కొంత భాగాన్ని మాత్రమే క్రిప్టోలకు కేటాయించడం మంచిది. లెవరేజ్ ఇస్తున్నారని ఆకర్షణకు లోనై ట్రేడ్స్ చేయటం మానుకోండి. సుబ్బురాజ్ ప్రకారం.. తమ వ్యక్తిగత రిస్క్ సామర్థ్యాన్ని మించి పెట్టుబడులు చేయని ఇన్వెస్టర్లు 2026లో తమ క్రిప్టో పెట్టుబడులను సురక్షితంగా ముందుకు తీసుకెళ్లగలరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




