Sarfaraz Khan : బీసీసీఐ ఆదేశాన్ని ధిక్కరించిన సర్ఫరాజ్ ఖాన్.. ముంబై కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో భారత క్రికెట్ వర్గాల్లో గందరగోళం నెలకొంది. సౌతాఫ్రికా 'ఏ' జట్టుతో జరగనున్న అనధికార టెస్ట్ సిరీస్కు సర్ఫరాజ్ ఖాన్ను సెలెక్టర్లు ఆశ్చర్యకరంగా పక్కన పెట్టారు. అంతేకాకుండా జాతీయ జట్టులో స్థానం దక్కాలంటే ముంబై జట్టులో అతను తన కామన్ ప్లేస్ (నం. 5) కంటే పై స్థానంలో బ్యాటింగ్ చేయాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం.

Sarfaraz Khan : ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో భారత క్రికెట్ వర్గాల్లో గందరగోళం నెలకొంది. సౌతాఫ్రికా ‘ఏ’ జట్టుతో జరగనున్న అనధికార టెస్ట్ సిరీస్కు సర్ఫరాజ్ ఖాన్ను సెలెక్టర్లు ఆశ్చర్యకరంగా పక్కన పెట్టారు. అంతేకాకుండా జాతీయ జట్టులో స్థానం దక్కాలంటే ముంబై జట్టులో అతను తన కామన్ ప్లేస్ (నం. 5) కంటే పై స్థానంలో బ్యాటింగ్ చేయాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. అయితే, ముంబై కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ ఈ సూచనను దాదాపుగా తోసిపుచ్చారు. తమ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉందని, మార్పు అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ భవిష్యత్ సెలక్షన్ల కోసం ముంబై జట్టులో ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
వెస్టిండీస్ సిరీస్కు సెలక్ట్ కాకపోవడంపై నిరాశ చెందిన సర్ఫరాజ్ ఖాన్, సౌతాఫ్రికా ‘ఏ’తో జరగనున్న రెండు మ్యాచ్ల అనధికార టెస్ట్ సిరీస్లో కచ్చితంగా ఆశించాడని సమాచారం. అయితే, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతన్ని ఈ సిరీస్కు కూడా విస్మరించింది. దీంతో సర్ఫరాజ్ రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఆడాల్సి వచ్చింది. సర్ఫరాజ్ చివరిసారిగా 2024లో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ తరఫున ఆడాడు.
జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే, సర్ఫరాజ్ ఖాన్ తన నం.5 ప్లేస్ నుండి పై స్థానంలో బ్యాటింగ్ చేయాలని బీసీసీఐ సూచించినట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల అతను తన సామర్థ్యాన్ని మరింత ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని సెలెక్టర్లు భావించారు. అయితే, ముంబై జట్టు కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ ఈ అంశంపై భిన్నంగా స్పందించారు. జమ్మూ కాశ్మీర్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో సర్ఫరాజ్, సీనియర్ ఆటగాళ్లు అజింక్యా రహానే, సిద్ధేష్ లాడ్ తర్వాత బ్యాటింగ్ చేశాడు. శార్దూల్ ఠాకూర్ స్పష్టం చేస్తూ.. “మా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది, మేము ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు” అని అన్నారు.
సర్ఫరాజ్ ఖాన్ తిరిగి భారత జట్టులోకి రావడానికి ఇండియా ‘ఏ’ మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదని శార్దూల్ ఠాకూర్ పేర్కొన్నారు. గాయం నుంచి కోలుకొని తిరిగి ఆడుతున్న సర్ఫరాజ్, స్థిరంగా పరుగులు సాధిస్తే, అతను నేరుగా జాతీయ టెస్ట్ జట్టులోకి తిరిగి రాగలడు అని ఠాకూర్ బలంగా చెప్పారు. “ఇండియా ‘ఏ’ జట్టు అంతర్జాతీయ క్రికెట్కు సిద్ధం చేయాలనుకునే ఆటగాళ్లను చూస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సర్ఫరాజ్కు ఇండియా ‘ఏ’ మ్యాచ్లు అవసరం లేదని నేను భావిస్తున్నాను. అతను పరుగులు చేస్తే నేరుగా టెస్ట్ సిరీస్లో కూడా ఆడగలడు” అని ముంబై కెప్టెన్ తెలిపారు.
సర్ఫరాజ్ ఖాన్ ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా రాణించగల కెపాసిటీ ఉన్న సీనియర్ ఆటగాడని శార్దూల్ ఠాకూర్ కొనియాడారు. “అతను ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఎప్పుడూ మంచి ప్రదర్శన ఇచ్చే సీనియర్ ప్రొఫెషనల్. అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా, స్థిరంగా భారీ స్కోర్లు చేస్తూనే ఉంటాడు. అతను నిరాశపరచని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్” అని ఠాకూర్ అన్నారు.
ప్రస్తుతానికి భారత జట్టు యాజమాన్యం, సెలెక్టర్లు సర్ఫరాజ్ భవిష్యత్తుపై ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. దీంతో ముంబై సెలెక్టర్లు, జాతీయ సెలెక్టర్ల మధ్య సమన్వయం లోపించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్ఫరాజ్ దృష్టి కేవలం భారీ స్కోర్లు చేయడంపైనే ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




