Rules Changing From 1 June 2023: జూన్ 1 నుంచి మారనున్న నిబంధనలు.. సామాన్యుడిపై తీవ్ర ప్రభావం పడనుందా..?
జూన్ నెల ప్రారంభమైంది. 1వ తేదీ నుంచి మారిన నిబంధనల కారణంగా సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్న్యూస్ తెలిపాయి. కమర్షియల్ గ్యాస్ ధరపై రూ.83 వరకు తగ్గింది. సహజంగా ప్రతినెల 1వ తేదీన కొన్ని రూల్స్ మారుతుంటాయి..
జూన్ నెల ప్రారంభమైంది. 1వ తేదీ నుంచి మారిన నిబంధనల కారణంగా సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. నెల ప్రారంభంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్న్యూస్ తెలిపాయి. కమర్షియల్ గ్యాస్ ధరపై రూ.83 వరకు తగ్గింది. సహజంగా ప్రతినెల 1వ తేదీన కొన్ని రూల్స్ మారుతుంటాయి. వినియోగదారులు వాటిని ముందస్తుగా గమనిస్తే మంచిది. లేకపోతే ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇందులో ఆధార్ కార్డు, పెట్టుబడులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ సబ్సిడీలు, విదేశ క్రెడిట్ కార్డు పేమెంట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ వంటి చాలా అంశాల్లో ఉన్నాయి. మరి జూన్ 1 నుంచి ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలుసుకుందాం.
- ఉచితంగా ఆధార్ అప్డేట్: ఆధార్ కార్డు ఉన్న వారు తమ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. పేరు, అడ్రస్ వంటి వివరాలను ఆన్లైన్ ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అవకాశం జూన్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా చేసినా రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
- బ్యాంకు ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు.. బ్యాంకుల్లో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్, కరెంట్ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేసి క్లెయిమ్ చేసుకోని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి నామినీ కోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్ చేయిన వారిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు గానీ, నామినీలకు గానీ డబ్బులు అందించేలా చర్యలు చేపట్టింది. ఇది జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 1 నుంచి 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. దీని ద్వారా అన్క్లెయిమ్డ్ అమౌంట్ను సెటిల్ చేయనుంది.
- వాహనదారులకు షాక్.. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి జూన్ 1 నుంచి భారీ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్కార్ అందిస్తున్న సబ్సిడీలో భారీ కోత విధించనుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) 2 స్కీమ్స్కు సంబంధించిన ప్రోత్సాహకాలను మార్చింది. గరిష్ఠంగా అందిస్తున్న సబ్సిడీని పరిమితి 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలపై ప్రస్తుతం KWhకి రూ.15 వేలు నుంచి KWhకి రూ.10 వేలకు తగ్గించింది.
- పిల్లల పేరుపై మ్యూచువల్ ఫండ్స్: మీ పిల్లల పేరుపై కొత్త ఖాతా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా పిల్లల పేర్లపై మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మార్కెట్ రెగ్యులేటర్ సంస్థ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త నిబంధన జూన్ 15 నుంచి అమల్లోకి రానుంది.
- ఎస్బీఐ అమృత్ కలశ్ స్కీమ్: ఎస్బీఐ కొత్త స్కీమ్ అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించింది. జూన్ 30 వరకు ఈ స్కీమ్లో చేరేందుకు అవకాశం ఉంది. 400 రోజుల టెన్యూర్ గల ప్రత్యేకమైన స్కీమ్ ఇది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
- దగ్గు సిరప్ పరీక్షలు: జూన్ 1 నుంచి భారత్ నుంచి ఎగుమతి చేసే అన్ని దగ్గు సిరప్లను తప్పనిసరిగా పరీక్షించనున్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ప్రకటించింది. ఔషధ ఎగుమతిదారులు ముందుగా ప్రభుత్వ ల్యాబ్లో మందును పరీక్షించి పరీక్ష నివేదికను చూపించాల్సి ఉంటుంది. దీని తర్వాత మాత్రమే ఔషధాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతి ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి