Telangana: భలే మంచి చౌక బేరం.! అద్దెకు కొండముచ్చులు.. రోజుకు కేవలం రూ. 100 మాత్రమే
కోతుల బెడదతో ఊళ్ళకు ఊర్లు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. కోతుల దాడిలో పంటలు కోల్పోతున్న రైతులు వానర సేనల నుండి పంటలను కాపాడుకోవడం కోసం మానవ ప్రయత్నాలు చేస్తున్నారు.. కొండముచ్చులను అద్దెకు తెచ్చుకొని కోతుల నుండి తాత్కాలిక ఉపశమనం పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.

కోతుల బెడద ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అతిపెద్ద సమస్యగా మారింది. వానర సేనలు అడవులను వదిలి ఊళ్లపై పడ్డాయి. గ్రామాలు, పట్టణాలన్న తేడా లేదు. వానర సేనల ఆకలి దాడులతో ఊళ్లకు ఊళ్ళు ఉక్కిరబిక్కిరవుతున్నాయి. గ్రామాల్లో ప్రజలపై పడి రక్కీ గాయపరుస్తున్న కోతులు ప్రజలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేకుండా చేశాయి. మరోవైపు పంటలను నాశనం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు పూర్తిగా కోతుల దాడిలో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో రైతులు దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. కోతుల బెడద నుండి విముక్తి కోసం ఏ చిన్న ఉపాయం దొరికిన ఆచరిస్తున్నారు. కోతుల బెడద నుండి విముక్తి కోసం కొండముచ్చులను ప్రయోగిస్తున్నారు. అయితే కొండముచ్చులను కొనే తాహత లేనివారు వాటిని అద్దెకు తెచ్చుకొని కోతుల బెడద నుండి తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు కోతుల బెడద అంతుచిక్కని అతిపెద్ద సమస్యగా మారింది. పాలకుర్తిలో కోతుల నుండి పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. కష్టపడి పండించిన ఏ పంటలనైనా కోతులు ధ్వంసం చేస్తున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కమ్మగాని శ్రీనివాస్ అనే రైతు తన మొక్కజొన్న, పత్తి, పంటలను కాపాడుకోవడం కోసం మానవ ప్రయత్నాలు చేపట్టాడు. కోతులు ఇప్పటికే సగం వరకు పంటలు ధ్వంసం చేసాయి. మిగిలిన పంటలను కాపాడుకోవడానికి శ్రీనివాస్ తన పక్క గ్రామంలో కొండముచ్చులను అద్దెకు ఇస్తున్నారని తెలిసి ఓ వ్యక్తి వద్ద కొండముచ్చును అద్దెకు తెచ్చుకున్నాడు. ఈ కొండముచ్చుకు రోజుకు 100 రూపాయల చొప్పున కిరాయి చెల్లిస్తున్నాడు. అద్దెకు తెచ్చిన కొండముచ్చును తన పొలం చుట్టూ తిప్పుతూ కోతులను తరుముతూ తన పంటలను కోతుల నుండి కాపాడుకుంటున్నాడు. కొండమచ్చు ఆహారానికి రోజుకు 100 రూపాయల దాని యజమానికి 100 రూపాయలు కిరాయి మొత్తం 200 రోజుకు ఖర్చు అవుతుండడంతో శ్రీనివాస్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో ఏపార్టీ చెందిన అభ్యర్థులు వచ్చిన కోతులను నివారించిన వారికే తన ఓటుతో పాటు తమ కుటుంబ ఓట్లు కూడా వేస్తామని కరాఖండిగా చెప్పాడు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు రోడ్లు, డ్రైనేజ్లు ఇతర సమస్యలు తీర్చకపోయినా పర్వాలేదు. కోతుల సమస్య తీర్చినవారినే ఎన్నుకుంటామన్నాడు.
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు




