ఆరు నెలలుగా ఒకే ఇంట్లో సహజీవనం.. ప్రియురాలిని హత్య చేసి పరారైన ప్రియుడు!
తనతో కలిసి జీవిస్తున్న 20 ఏళ్ల యువతిని గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలిని అనుషగా గుర్తించగా.. నిందితుడిని శరత్గా గుర్తించారు. వీరిద్దరూ హాసన్ జిల్లాలోని సకలేశ్పూర్కు చెందినవారు. వీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై..

బెంగళూరు, జూన్ 17: ఓ జంట ఇన్స్టా పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరు గొడవలు పడ్డారు. కోపంతో ఊగిపోయిన యువకుడు తన సహజీవన భాగస్వామిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో చోటు చేసుకుంది. తనతో కలిసి జీవిస్తున్న 20 ఏళ్ల యువతిని గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలిని అనుషగా గుర్తించగా.. నిందితుడిని శరత్గా గుర్తించారు. వీరిద్దరూ హాసన్ జిల్లాలోని సకలేశ్పూర్కు చెందినవారు. వీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై, గత ఆరు నెలలుగా మల్లేశ్వరంలో సహజీవనం చేస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం..
శరత్ నగరంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అనూష, శరత్ గత శనివారం రాత్రి వ్యక్తిగత విషయాలపై గొడవపడ్డారు. వాగ్వాదం కాస్తా తీవ్రరూపం దాల్చింది. దీంతో క్షణికావేశంలో అనుషను గొంతు నులిమి శరత్ హత్య చేశాడు. అనంతరం తాను చేసిన నేరం గురించి శరత్ తన లాయర్కు సమాచారం ఇవ్వడంతో సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ లాయర్ శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి అనూష మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు శరత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత అనుష మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్న పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
