Indrakeeladri: రాజరాజేశ్వరిదేవిగా దుర్గమ్మ దర్శనం.. బారులు తీరిన భక్తులు.. తెప్పోత్సవం రద్దు..
ఏపీలోని ప్రముఖ అమ్మావారి పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా పదకొండో రోజు అంటే ఈ రోజు కనక దుర్గమ్మ శ్రీ రాజ రాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు శ్రీ రాజ రాజేశ్వరి దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల విజయాలు సొంతం అవుతాయని నమ్మకం. తెల్లవారు జాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు.

దేశ వ్యాప్తంగా శరన్నరవారత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు విజయదశమి కావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు , అమ్మవారి ఆలయాలు అన్నీ భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ అమ్మవారి పుణ్యక్షేత్రం అయిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శారద నవరాత్రులలో చివరి రోజు అయిన దసరా రోజున కనకదుర్గాదేవి శ్రీ రాజరాజేశ్వరి మాతగా భక్తులకు దర్శనం ఇస్తోంది. విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని శరణు వేడిన భక్తులకు సకల శుభాలను, విజయాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం.
దసరా నవరాత్రుల్లో చివరి రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గాదేవి రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు ఇంద్ర కీలాద్రి భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. గత ఏడాది మొత్తం పది రోజుల దసరా ఉత్సవాల్లో 8.94 లక్షల మంది దర్శించుకోగా, ఆ తర్వాత రెండు రోజుల భవానీ దర్శనాలతో కలిపి 12 లక్షల వరకు చేరింది. అయితే ఈ ఏడాది ఉత్సవాలు ఇంకా పూర్తికాలేదు.. కేవలం తొమ్మిది రోజుల్లోనే 11 లక్షలు దాటింది.
విజయదశమిని పురష్కరించుకుని దుర్గమ్మ దర్శనానికి అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులను అనుమతించారు. దసరా రద్దీ కారణంగా వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు దుర్గగుడి ఈవో. కాగా ఇంద్రకీల్రాదిపై దసరా ఉత్సవాల ముగింపులో భాగంగా విజయదశమి రోజున నిర్వహించే హంసవాహన తెప్పోత్సవం ఈ ఏడాది రద్దు అయింది.
గతేడాది కూడా వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కారణంగా నది ఒడ్డున దుర్గాఘాట్పై సిద్ధం చేసిన హంస వాహనంపై పూజ కార్యక్రమం మాత్రమే నిర్వహించారు. ఈ ఏడాది వరద ప్రవాహం ఆరున్నర లక్షల క్యూసెక్కులకు మించి ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో తెప్పోత్సవ నిర్వహణను అధికారులు రద్దు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




