ఘోర ప్రమాదం.. కరెంట్ వైర్లకు తగిలి కాలిబుడిదైన బస్సు.. స్పాట్లోనే..
రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సుకు హైటెన్షన్ విద్యుత్ లైన్ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 10 మందికి పైగా గాయపడ్డారు. ఇటుక బట్టీ కార్మికులు ఉన్న ఈ బస్సు ప్రమాదం మనోహర్పూర్ సమీపంలో జరిగింది.

కర్నూల్ ఘోర బస్సు ప్రమాదం మరవకముందే మరో ప్రమాదం జరిగింది. రాజస్థాన్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. జైపూర్-ఢిల్లీ రహదారిపై బస్సుకు హైటెన్షన్ లైన్ తగిలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. బస్సులో ఇటుక బట్టీ కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
ఈ సంఘటన జైపూర్ జిల్లా మనోహర్పూర్ సమీపంలో జరిగింది. ఉత్తరప్రదేశ్ నుండి తోడిలోని ఒక ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తున్న బస్సు, ఎత్తైన ప్రాంతం గుండా వెళుతుండగా ప్రమాదవశాత్తు 11,000 వోల్ట్స్ గల హైటెన్షన్ లైన్ను తాకింది. లైన్ తగలగానే బస్సులో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి మంటలు చెలరేగాయి. మంటల్లో గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అందులో పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురు ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం జైపూర్కు తరలించారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికుల మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్షల నిమిత్తం మార్చురీలో ఉంచారు. ఈ దుర్ఘటనపై మనోహర్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గతంలో 21మంది..
గతంలోనూ రాజస్థాన్లో ఇలాంటి ఘోర ప్రమాదం జరిగింది. జైసల్మేర్లో జోధ్పూర్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుని 21 మంది మరణించారు. బస్సులో మండే ఫైబర్ను ఉపయోగించడం, సేఫ్టీ డోర్ లాక్ చేసి ఉండటం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని అప్పట్లో తేలింది. తాజాగా జరిగిన ఈ ప్రమాదం మళ్లీ ప్రయాణికుల భద్రతపై ఆందోళనలను పెంచుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




