AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిరు, పవన్‌లతో సినిమాలు.. 5 పెళ్లిళ్లతో సంచలనం.. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కులేని చావు

సాధారణంగా 300 కు పైగా సినిమాల్లో నటించాడంటే అంతో ఇంతో ఆస్తులు వెనకేసుకుని ఉంటారు. కానీ ఈ టాలీవుడ్ నటుడు చనిపోయేటప్పుడు మాత్రం చేతిలో చిల్లి గవ్వ మిగుల్చుకోలేదు. చివరకు అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంచింది. అందకే ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు.. ఇలాంటి చావు మరొకరికి రాకూడదని..

Tollywood: చిరు, పవన్‌లతో సినిమాలు.. 5 పెళ్లిళ్లతో సంచలనం.. చివరకు చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కులేని చావు
Tollywood Actor
Basha Shek
|

Updated on: Aug 20, 2025 | 8:07 PM

Share

ఫిబ్రవరి 9, 2019.. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని యారి రోడ్‌లోని కినారా అపార్ట్‌మెంట్స్‌.. ఒక ఫ్లాట్ తలుపు రెండు రోజులగా మూస వేసి ఉంది. ఫ్లాట్ బయట టిఫిన్‌ పొట్లాలు పేరుకుపోయాయి. ఇంటి లోపలి నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు . వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. అంతే అక్కడున్న దృశ్యాన్ని చూసి అందరినీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. సుమారు 300 కు పైగా సినిమాలు చేసిన ఓ ప్రముఖ నటుడి శరీరం కుళ్ళిపోయి ఉంది. అతని చేతిలో సగం తాగిపడేసిన మద్యం బాటిల్, ముందు భోజనం పొట్లాలు ఉన్నాయి. అవి కూడా బూజు పట్టిపోయాయి. అప్పుడందరి మదిలో ఒకటే ప్రశ్న మెదిలింది. తన విలనిజంతో స్టార్ హీరోలను భయ పెట్టిన ఒక నటుడు ఎందుకిలా అనాథ శవంలా పడి ఉన్నాడు? రీల్ లైఫ్ లో ఎంతో సక్సెస్ అయిన ఈ నటుడు రీల్ లైఫ్ లో మాత్రం ఎందుకిలా అనాథగా మరణించాడు. టాలీవుడ్ తో పాటు యావత్ భారత సినిమా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసిన ఆ చావు మరెవరిదో కాదు..1980-90 వ దశకంలో నంబర్ వన్ విలన్ గా ఓ వెలుగు వెలిగిన మహేశ్‌ ఆనంద్‌ది.

మహేష్ ఆనంద్ 1961 లో జన్మించాడు. బలమైన శరీరాకృతి కలిగిన మహేష్ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సొంతం చేసుకున్నాడు. మోడలింగ్, డ్యాన్స్‌లో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. 1982 లో ‘సనమ్ తేరి కసమ్’ చిత్రం టైటిల్ సాంగ్‌లో ప్లేబ్యాక్ డ్యాన్సర్‌గా మొదటి సారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు. అందులో అతని లుక్స్ మరియు నటన అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆ తర్వాత 1988లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘షహెన్‌షా’లో విలన్ గా అదరగొట్టాడు. ఈ సినిమా తర్వాత, అతని కెరీర్ ఊపందుకుంది. ‘గంగా జమునా సరస్వతి’, ‘తూఫాన్’, ‘గుమ్రా’, ‘సస్తి దుల్హాన్ మహాంగ్ దుల్హా’ వంటి చిత్రాలతో స్టార్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లో కరడుగట్టిన విలన్‌గా పేరు గడించిన మహేశ్‌ ఆనంద్‌.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్‌, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్‌ వన్‌, బాలు తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. 90వ దశకంలో సంవత్సరానికి 6-8 సినిమాలు చేశాడు మహేష్ ఆనంద్. అలా కెరీర్ లో దాదాపు 300 చిత్రాల్లో నటించి మెప్పించాడు.

రీల్ లైఫ్ లో సక్సెస్.. రియల్ లైఫ్ లో మాత్రం..

సినిమాల్లో సక్సెస్ అయిన ఆనంద్ మహేష్ వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యగా పెళ్లిళ్ల విషయంలో.. మొదట బర్క రాయ్‌ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడీ స్టార్ విలన్. ఆ తర్వాత 1987లో మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే ఈ పెళ్లి కూడా పెటాకులైంది. ఈ సమస్యలు మహేశ్ కెరీర్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. పెళ్లి బంధంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్‌.. 2015లో రష్యన్‌ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె కూడా మహేష్ ను వదిలేసింది.

ఇవి కూడా చదవండి
Mahesh Anand

Mahesh Anand

2019లో రంగీలా రాజా అని ఓ సినిమా చేశాడు ఆనంద్ మహేష్. ఇది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. ఈ మూవీ రిలీజైన 22 రోజులకే మహేష్ ఆనంద్ కన్నుమూశాడు. శవపరీక్ష లో అతనిది సహజ మరణమని తేలింది. అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే పోస్ట్ మార్టమ్ తర్వాత కూడా ఆనంద్ మహేష్ బాడీ చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంది, చివరికి, రష్యాలో ఉన్న అతని భార్య లానా మహేష్ కు అంత్యక్రియలు నిర్వహించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us