ఆ ఒక్క సీటుతో టీడీపీ-బీజేపీ మధ్య కొత్త చిక్కులు.. ఈసారి త్యాగం ఎవరిది..
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమిలో సీట్ల సర్ధుబాటు కొలిక్కి రావడం లేదు. ఎన్డీయేలో చేరికకు ముందే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా తమ మొదటి విడత అభ్యర్ధులను ప్రకటించింది. స్వయంగా రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమిలో సీట్ల సర్ధుబాటు కొలిక్కి రావడం లేదు. ఎన్డీయేలో చేరికకు ముందే తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన కూడా తమ మొదటి విడత అభ్యర్ధులను ప్రకటించింది. స్వయంగా రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనేది ప్రకటించారు. మొదటి విడత జాబితా విడుదల రోజు జనసేన పార్టీ 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాల్లో బరిలో ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇక తెలుగుదేశం పార్టీ మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. మొదటి జాబితా ప్రకటన తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎన్డీయేలో తెలుగుదేశం పార్టీ చేరడంతో కొత్త కూటమి ఏర్పడింది. ఎన్డీయేలో టీడీపీ చేరిక తర్వాత సీట్ల సర్ధుబాటుపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
బీజేపీ కేంద్ర పెద్దలు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నివాసానికి వెళ్లి గంటల తరబడి చర్చించిన తర్వాత సీట్ల సర్ధుబాటుపై ప్రకటన చేసారు. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ.. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ, భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మరో 34 మందితో రెండో విడత జాబితాను విడుదల చేసింది. తాజాగా మరో 11 మంది అభ్యర్ధులతో అసెంబ్లీ అభ్యర్థులకు మరో జాబితాను ప్రకటించింది. జనసేన కూడా 18 మందితో జాబితాను విడుదల చేసింది. అయితే ఇది జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ మిగిలిన సీట్లపై స్పష్టత రావడం లేదు. బీజేపీకి పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. కానీ ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీట్ల సర్ధుబాటుపై స్పష్టత లేకపోవడంతో మరో 19 స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన పెండింగ్లోనే ఉంది.
టీడీపీ-బీజేపీ మధ్య కుదరని ఒప్పందం..
కూటమి అభ్యర్ధుల ప్రకటనలో మరో 19 స్థానాలపై క్లారిటీ రావడం లేదు. అయితే వీటిలో మూడు స్థానాలు త్వరలోనే ప్రకటిస్తామని జనసేన ఇప్పటికే తెలిపింది. పాలకొండ, విశాఖ దక్షిణం, అవనిగడ్డ స్థానాలకు త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక మిగిలిన 16 స్థానాలపైనే చిక్కుముడి వీడటం లేదు. ఈ 16 స్థానాల్లో లెక్క ప్రకారం బీజేపీకి 10, తెలుగుదేశం పార్టీకి ఆరు స్థానాలు దక్కాల్సి ఉంది. అయితే తాజాగా బీజేపీ 11 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే పెండింగ్లో ఉన్న స్థానాల్లో కొన్నింటిలో రెండు పార్టీలు ఒక క్లారిటీకి రాలేకపోతున్నాయి. పాడేరు, భీమిలి, చీపురుపల్లి, ఎచ్చెర్ల, విశాఖ నార్త్, కైకలూరు, విజయవాడ వెస్ట్, దర్శి, ఆదోని, ఆలూరు, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ధర్మవరం, రాజంపేట, బద్వేలు, జమ్మలమడుగు స్థానాల్లో కొన్నింటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు స్పష్టత వచ్చిన వాటిలో బీజేపీకి పాడేరు, ఎచ్చెర్ల, విశాఖ నార్త్, కైకలూరు, విజయవాడ వెస్ట్, ధర్మవరం, బద్వేలు, జమ్మలమడుగు ఖరారయినట్లు తెలిసింది.
ఇక ముందుగా ఆదోని స్థానం బీజేపీకి దక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ తాజాగా ఆదోని బదులు ఆలూరు స్థానాన్ని బీజేపీ కోరుతున్నట్లు సమాచారం. అలాగే టీడీపీ ఇప్పటికే ప్రకటించిన అనపర్తి, విశాఖ సిటీ స్థానాల్లో ఏదో ఒకటి తమకు ఇవ్వాలని భారతీయ జనతాపార్టీ అడుగుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక భీమిలి, చీపురుపల్లి స్థానాలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కేటాయింపుపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇదే విధంగా గుంతకల్లు టిక్కెట్ కూడా గుమ్మనూరు జయరాంకు ఇవ్వడంపైనా స్థానిక పరిస్థితులతో ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు చెబుతున్నట్లు మరో సీటు అదనంగా ఇవ్వాల్సి ఉంటే ఈసారి ఖచ్చితంగా టీడీపీ త్యాగం చేయాల్సిందేనని అంటున్నారు. తప్పనిసరి పరిస్థితి అయితే రాజంపేట సీటును ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. మొత్తానికి పెండింగ్ స్థానాలపై ఎప్పటికి క్లారిటీ వస్తుందో అంతుచిక్కడం లేదు. ఓవైపు వైసీపీ టిక్కెట్లు కేటాయింపు పూర్తయి ప్రచారం కూడా జోరుగా సాగుతుంటే కూటమి సీట్లు ఖరారు కాకపోవడం ఆయా పార్టీల నేతలకు కొత్త టెన్షన్ తెచ్చిపెడుతుందట. జనసేన స్థానాలు పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ పెండింగ్లోనే ఉన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…