ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల అధికారి కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా వచ్చే ఫిర్యాదులు, ఇబ్బందుల పరిష్కారంపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్ధేశం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ పక్కాగా అమలయ్యేలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా వచ్చే ఫిర్యాదులు, ఇబ్బందుల పరిష్కారంపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై దిశానిర్ధేశం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఎక్కడ ఉల్లంఘన జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాల ఎన్నికల అధికారులకు సూచించారు. తాజాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు తీరుపై మరోసారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఈఓ మీనా. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారంపై తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. కనీసం 48 గంటలకు ముందుగా సువిధ యాప్లో అప్లై చేసుకోవాలని సూచించారు. అటు అనుమతులను 24 గంటలలోపే మంజూరు చేయాలని కలెక్టర్లకు సూచించారు.కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీల హోర్డింగ్ లు,ఫ్లెక్సీలు తొలగించేసారు. అయితే ఆయా రాజకీయ పార్టీలకు ఉన్న పర్మినెంట్ కార్యాలయాల్లో హోర్డింగుల తొలగింపు అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు నేతలు.
దీనిపై జిల్లాల ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేసారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో శాశ్వత ప్రాతిపదికన ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాల్లో స్థానిక చట్టాలు, అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలని సీఈఓ ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఎప్పటి నుండో శాశ్వత ప్రాతిపదిక ఉన్న పార్టీ కార్యాలయాల్లో అనుమతి పొంది ఉన్న హోర్డింగులను తొలగించకుండా కొనసాగించాలన్నారు. అయితే ఆ హోర్డింగుల నిర్మాణాలు బలహీనంగా ఉంటే భద్రత దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాల్లో 4 x 8 అడుగుల బ్యానర్, ఒక జెండాను అనుమతించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబందించి భారత ఎన్నిక సంఘం మార్గదర్శకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం, స్థానిక సంస్థల చట్టం, జి.హెచ్.ఎం.సి. చట్టాలను పరిగణలోకి తీసుకుంటూ అనుమతులను మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు.
ఇంటింటి ప్రచారంలో అనుమతి తప్పనిసరి..
రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు అనుమతి తప్పని సరి అని, అయితే ఇందుకు 48 గంటల ముందుగా సువిధా పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని మీనా తెలిపారు. కానీ కొన్ని అత్యవసర పరిస్థితిల్లో రాజకీయ పార్టీలు 48 గంటల ముందు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేని పక్షంలో ఆఫ్ లైన్ ద్వారా కూడా అత్యవసర దరఖాస్తులను స్వీకరించి, తగిన అనుమతులను జారీచేయాలని సూచించారు. ముందుగా అనుమతి పొందిన తర్వాతే ఇంటింటి ప్రచారానికి వెళ్లాలనే ఈసీ నిబంధన ఉంది. ఈ నిబంధనపై అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిబంధనను పున: సమీక్షించాలని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. అయితే ఈ నిబంధన అమలు విషయంలో పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు, భారత ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లామన్నారు ఎన్నికల అధికారి మీనా. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత ఇస్తామన్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతో పాటు కార్యాలయాల్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దన్నారు. ప్రస్తుతం జాతీయ ప్రధాన రహదారుల ప్రక్కనున్న హార్డింగులను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయిచాలని, నూతన హోర్డింగులకు అనుమతులను ఏమాత్రం ఇవ్వద్దన్నారు. ప్రైవేటు భవనాలపై వాల్ పెయింట్స్కు ఎటు వంటి అనుమతిలేదని, ఇప్పటికే ఉన్నవాటిని వెంటనే చెరిపించేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతితో ప్రైవేటు భవనాలపై ఇప్పటికే ఉన్న హోర్డింగులు, కటౌట్ల భద్రతను, నిర్మాణ స్థిరత్వాన్ని ఒకసారి పరిశీలించాలని, స్ట్రక్చర్లో ఏమాత్రం దృఢత్వం లేకపోయినా ప్రకటనలకు అనుమతించ వద్దన్నారు. ముందస్తు అనుమతితో ప్రైవేటు ప్రాంగణాల్లో సులువుగా తరలించగలిగే ఒక జండాను, చిన్న బ్యానర్ను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతించాలని సూచించారు. అదే విధంగా సి-విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను పటిష్టంగా అమలుపరచడం తదితర అంశాలపై కూడా జిల్లా ఎన్నికల అధికారులతో చర్చించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…