Godavari River: గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Godavari water level rises: భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం
Godavari water level rises: భారీగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం గోదావరిలో 43.8 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరిలో నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ఆదేశించారు.
ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 6,19,825 క్యూసెక్కులు ఉన్నట్లు విపత్తుల శాఖ తెలిపింది. వరద ముంపు ప్రభావిత మండలాల అధికారుల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ముందస్తుగా అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరికలు జారీ చేసింది. వరద నీటిలో స్నానానికి వెళ్లడం లాంటివి చేయొద్దని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు.
కాగా.. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇంకా నీటిమట్టం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నది నీటిమట్టం 48 అడుగులకు చేరితే.. రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు.
Also Read: