Telangana: తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..?
తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాలు విడుదల అయ్యాయి. గతేడాది నవంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1370 ఎంపికైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే..?

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. గ్రూప్ 3 సర్వీసెస్ రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రోవిజనల్ ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2022 లో 1388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువడింది. గత ఏడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. కోర్టు కేసులు, గ్రూప్-1,2 వివాదాల కారణంగా గ్రూప్-3 ఫలితాలు ఆలస్యంగా విడుదల చేశారు.
గ్రూప్ 3 పరీక్ష మొత్తం 1388 పోస్టుల భర్తీకి నిర్వహించగా 1370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు TGPSC ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 14,న ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (GRL) ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను కమిషన్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఫలితాల కోసం https://www.tgpsc.gov.in వెబ్సైట్ లోకి వెళ్లాలి
ప్రస్తుతం విడుదల చేసిన ఈ ఫలితాలు కోర్టులలో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్లతుది తీర్పునకు లోబడి ఉంటాయని కమిషన్ స్పష్టం చేసింది. ఒకవేళ అభ్యర్థులు ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే, వారి ఎంపికను ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం కమిషన్కు ఉంటుందని TGPSC సెక్రటరీ డాక్టర్ ప్రియాంక అలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




