TRAI New Rule: ‘1600’ నెంబర్లతోనే ఇక నుంచి మీకు కాల్స్ .. ట్రాయ్ సంచలన ఆదేశాలు
సైబర్ నేరగాలను అరికట్టేందుకు ట్రాయ్ అనే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇండియాలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల మంది తమ సొమ్ము పొగోట్టుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ అనే పదం ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ట్రాయ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Updated on: Dec 18, 2025 | 7:05 PM

ఇటీవల స్పామ్ కాల్స్తో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వీటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో స్పామ్ కాల్స్ను కట్టడి చేసి సైబర్ నేరాలను తగ్గించేందుకు టెలికాం రెగ్యూలేటరీ ఆఫ్ ఇండియా బీమా కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

బీమా కంపెనీలు తమ కస్టమర్లకు కాల్ చేయడానికి తప్పనిసరిగా 1600 సిరీస్ నెంబర్లను మాత్రమే వాడాలని ట్రాయ్ ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. వినియోగదారులు సురక్షితంగా ఉండటానికి, అవాంఛిత కాల్స్ను తగ్గించడానికి, ఫోన్ సంబంధిత మోసాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.

డిసెంబర్ 16న ట్రాయ్ జారీ చేసిన నోటీసుల ప్రకారం.. 2026 ఫిబ్రవరి 15 నుంచి సర్వీస్, లావాదేవీల కాల్ కోసం ఐఆర్డీఏఐ నియంత్రణ సంస్థలు 1600 సిరీస్కు మారాలని ఆదేశించింది. ఐఆర్డీఏఐతో సంప్రదించిన అనంతరం ఈ గడువును నిర్ణయించారు. గతంలో ఆర్బీఐ, సెబీ, పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడే సంస్థలకు ట్రాయ్ ఇలాంటి ఆదేశాలు జారీ చేసింది.

బ్యాంకింగ్,ఆర్ధిక సేవలు, బీమా రంగానికి చెందిన సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు 1600 సిరీస్ ఫోన్ నెంబర్లను కేటాయించింది. వినియోగదారులు సర్వీస్ కాల్స్, వ్యాపార కాల్స్ను సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని ట్రాయ్ స్పష్టం చేసింది. లావాదేవీల కోసం ఇప్పటికీ 10 అంకెల ఫోన్ నెంబర్లను వాడుతున్న సంస్థలు.. 1600 సిరీస్ నెంబర్లకు మారేలా సమయం ఇచ్చింది.

భారత్లో సైబర్ నేరాలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఓటీపీ తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ ఈ నిబంధనలు కొత్తగా అమల్లోకి తెస్తోంది.




