రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్న వరి కొయ్యలు.. 5 రోజుల్లో ఇద్దరు మృతి! ఏం జరిగిందంటే?
పొలాన్ని శుభ్రం చేద్దామనుకున్న రైతుల ప్రాణాలను వరికొయ్యలే బలితీసుకుంటున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలో ఇద్దరు రైతులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వరి కోతల తర్వాత మిగిలిన కొయ్యలను తగలబెట్టే క్రమంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి..

సిద్దిపేట, జూన్ 4: పసిడి పంటలు పండించే అన్నదాతను దురదృష్టం వెంటాడుతోంది. పొలాన్ని శుభ్రం చేద్దామనుకున్న రైతుల ప్రాణాలను వరికొయ్యలే బలితీసుకుంటున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే సిద్దిపేట జిల్లాలో ఇద్దరు రైతులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వరి కోతల తర్వాత మిగిలిన కొయ్యలను తగలబెట్టే క్రమంలో ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. ఈరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలో వరి కొయ్యలు తగలబెడుతూ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని మద్దెల మల్లయ్య అనే రైతు మృతి చెందాడు. వరికొయ్యలకు నిప్పు పెట్టిన మల్లయ్య, అందరు చూస్తుండగానే మంటలు తీవ్రరూపం దాల్చడంతో వాటి మధ్య చిక్కుకుపోయాడు. దట్టమైన పొగ, సెగలు కమ్ముకోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మంటల్లో పడి చనిపోయాడు.
Also Read: పులి, మేక, గడ్డి, రైతు.. నది ఎలా దాటాలి? మీ తెలివితేటలకు సవాల్ విసిరే చిక్కు ప్రశ్న
ఇలాగే సరిగ్గా ఐదు రోజుల క్రితం అక్బర్పేట భూంపల్లి మండలం ఎనగుర్తిలో ఇలాంటి ఘటనే జరిగింది. 60 ఏళ్ల వృద్ధ రైతు ఎల్లయ్య తన పొలంలో వరికొయ్యలకు మంటలు పెట్టాడు. అయితే గాలివాటంతో మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. పొగ తీవ్రతకు ఊపిరాడక ఎల్లయ్య తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు రైతులు ఒకే రకమైన ప్రమాదంలో చనిపోవడంతో రెండు గ్రామాలలో విషాద ఛాయలు అలుము కున్నాయి.
మరో వైపు వరికొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణానికే కాదు,ప్రాణాలకూ ముప్పని అధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నా రైతులు వినడం లేదు. ఒక్కసారిగా గాలి వీస్తే మంటలను అదుపు చేయడం అసాధ్యమని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి.ఇప్పటికైనా అన్నదాతలు వరికొయ్యలను తగలబెట్టే పద్ధతిని వీడాలని, ఆధునిక యంత్రాలతో వాటిని తొలగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
