AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీ కూటమిలో ఏం జరుగుతోంది.. ఐక్యతారాగమా..? రెబల్‌ పోటీయా?

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అసలు ఏం జరుగుతోంది? ఏపీలో నామినేషన్ గడువు దగ్గర పడుతోంది. కూటమి నేతల్లో ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. అసంతృప్తులను చల్లార్చేందుకు కూటమి నేతలు ఉమ్మడిగా ప్రచారం మొదలెట్టినా.. ఎక్కడో ఓ దగ్గర లుకలుకలు తప్పడం లేదు. కొన్నిచోట్ల టికెట్‌ దక్కలేదని, మరోచోట రెబల్‌ అభ్యర్థులు బరిలో ఉండటంతో కేడర్‌ అయోమయంలో ఉంది.

AP News: ఏపీ కూటమిలో ఏం జరుగుతోంది.. ఐక్యతారాగమా..? రెబల్‌ పోటీయా?
Tdp, Janasena, Bjp
Srikar T
|

Updated on: Apr 11, 2024 | 11:30 AM

Share

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అసలు ఏం జరుగుతోంది? ఏపీలో నామినేషన్ గడువు దగ్గర పడుతోంది. కూటమి నేతల్లో ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. అసంతృప్తులను చల్లార్చేందుకు కూటమి నేతలు ఉమ్మడిగా ప్రచారం మొదలెట్టినా.. ఎక్కడో ఓ దగ్గర లుకలుకలు తప్పడం లేదు. కొన్నిచోట్ల టికెట్‌ దక్కలేదని, మరోచోట రెబల్‌ అభ్యర్థులు బరిలో ఉండటంతో కేడర్‌ అయోమయంలో ఉంది. ఇంతకీ.. కూటమిలో అసమ్మతి చల్లారేనా? ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటన మొదలు.. ఇప్పటివరకూ పలు నియోజకవర్గాల్లో అసమ్మతి పూర్తిగా చల్లారలేదు. కొన్నిచోట్ల కేడర్‌ పెద్దయెత్తున నిరసనలు, రాజీనామాల నేపథ్యంలో ఒకరిద్దరు అభ్యర్థులను మార్చింది టీడీపీ అధిష్ఠానం. జనసేనలోనూ కొన్ని నియోజకవర్గాల్లో టికెట్‌ దక్కక నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ అసంతృప్తులను చల్లార్చేందుకు ఉభయగోదావరిజిల్లాలో కూటమి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. అసంతృప్తనేతలతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.

కడపజిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థిని తానేనంటూ టీడీపీ నేత బాల సుబ్రహ్మణ్యం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత చెంగల్రాయుడు కూడా ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థిపై చంద్రబాబు పునరాలోచన చేస్తారని చెబుతున్నారు. దాంతో ఇద్దరు నేతల ప్రచారంతో తెలుగు తమ్ముళ్లలో అయోమయం నెలకొంది. తూర్పు గోదావరిజిల్లా అనపర్తిలో బీజేపీ అభ్యర్థి, మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అయితే శివరామకృష్ణం రాజు ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎన్నికల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేవరకూ టీడీపీ కండువా మెడలో వేసుకోవద్దంటూ వాగ్వాదానికి దిగారు. దాంతో కండువా తీసేసి ప్రచారం చేశారాయన. మరోవైపు తనకే టికెట్‌ కేటాయిస్తారంటున్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అయితే అభ్యర్థి ఎవరైనా వైసీపీని ఓడించడమే లక్ష్యమంటున్నారు బీజేపీ నేత శివరామకృష్ణం రాజు.

నెల్లూరుజిల్లా కావలిలోనూ రెబల్‌ రాజకీయం హీటెక్కింది. టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నించి భంగపడ్డ పసుపులేటి సుధాకర్‌.. స్వతంత్రంగా బరిలో దిగాలని డిసైడయ్యారు. టికెట్ విషయంలో టీడీపీ తనను మోసం చేసిందని.. తానూ గెలిస్తే సొంత నిధులతో కావలిని అభివృద్ధి చేస్తానన్నారు సుధాకర్‌. పశ్చిమ గోదావరిజిల్లా తణుకులో జనసేనకు విడివాడ రామచంద్రరావు ఝులక్‌ ఇచ్చారు. టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయనతో పార్టీ నేతలు చర్చలు జరిపినా టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణతో కలిసి పనిచేయటానికి ముందుకురాలేదు. పవన్‌ తణుకు పర్యటనలో ప్లే కార్డులు పట్టుకుని నిరసన చేశారు విడివాడ అనుచరులు. గెలిచే టికెట్స్‌ త్యాగం చేస్తారా? వారాహియాత్రలో ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదంటూ ప్లే కార్డులను ప్రదర్శించారు. ఇక ఇలాంటి అసమ్మతుల జాబితాలో గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మహిళా నాయకురాలు గిడ్డి ఈశ్వరి కూడా ఉన్నారు. 2019లో టీడీపీ తరఫున ఓడిపోయినప్పటికీ ఆ పార్టీనే నమ్ముకుని ఈ ఐదేళ్లు పనిచేశారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అయిన కిల్లు వెంకట రమేష్ నాయుడుకి టికెట్ కేటాయించింది తెలుగుదేశం. ఈ నేపథ్యంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు గిడ్డి ఈశ్వరి. బుధవారం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో బహిరంగంగానే ప్రకటించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి పాడేరును చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తానన్నారు. ఇలా ఇప్పటి వరకు కూటమిలో రెబల్స్‌ బెడద, అసంతృప్త జ్వాలలు ఇంకా చల్లారలేదు. ఐతే త్వరలో ఇవన్నీ సమసిపోతాయని కూటమి నేతలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us