కార్ల దిగుమతులపై ‘ట్రంప్ టారిఫ్’ బాంబు.. అమెరికా నిర్ణయంతో ప్రపంచ వాణిజ్యంలో అలజడి!
అమెరికా - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉమ్మడి వాణిజ్య ఒప్పందానికి విరుద్ధంగా యూరప్ నుండి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని మార్గాలనూ తెరిచి ఉంచుతామని యూరోపియన్ యూనియన్ శనివారం (మే 2, 2026) హెచ్చరించింది.

అమెరికా – యూరోపియన్ యూనియన్ (EU) మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఉమ్మడి వాణిజ్య ఒప్పందానికి విరుద్ధంగా యూరప్ నుండి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను 25 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని మార్గాలనూ తెరిచి ఉంచుతామని యూరోపియన్ యూనియన్ శనివారం (మే 2, 2026) హెచ్చరించింది.
గత ఏడాది కుదిరిన ఒప్పందం ప్రకారం, అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలను నిలిపివేయడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు కోటాలను అమలు చేయడానికి ఈయూ అంగీకరించింది. దీనికి ప్రతిగా, యూరోపియన్ ఉత్పత్తులపై సుంకాన్ని 15 శాతం వద్దే ఉంచుతామని అమెరికా హామీ ఇచ్చింది. అయితే, ఈయూ తన కట్టుబాట్లను పాటించడం లేదని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. “ఈయూ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ సుంకాల పెంపు ద్వారా అమెరికాకు బిలియన్ల డాలర్ల ఆదాయం రావడమే కాకుండా, విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించేలా ఒత్తిడి పెరుగుతుంది,” అని ట్రంప్ స్పష్టం చేశారు.
ట్రంప్ నిర్ణయంపై బ్రస్సెల్స్లోని ఈయూ ప్రధాన కార్యాలయం తీవ్రంగా స్పందించింది. తాము ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, శాసన ప్రక్రియలో భాగంగా ప్రతి అడుగును వాషింగ్టన్కు తెలియజేస్తున్నామని ఈయూ ప్రతినిధి తెలిపారు. అమెరికా ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుందో వివరణ ఇవ్వాలని ఈయూ కోరింది. ఒకవేళ అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే, ఐరోపా మార్కెట్ను కాపాడుకోవడానికి ప్రతికూల చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రస్తుతం అమెరికాలో జపాన్, దక్షిణ కొరియా, కెనడా వంటి దేశాల సహకారంతో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన ఆటో ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. వాహన తయారీ సంస్థలన్నీ అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలన్నదే ట్రంప్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, ఈ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ సప్లై చెయిన్ దెబ్బతినడమే కాకుండా, ప్రపంచ ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
