Petrol Prices: పెరుగుతున్న పెట్రోల్ ధరలు.. జీఎస్టీ విధిస్తే లీటర్ ఎంతకు వస్తుందో తెలుసా..?
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్లు ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుతం ఇంధనం ధరలు పెరుగుతున్న క్రమంలో ఆ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు రద్దు చేసి జీఎస్టీ విధించడం వల్లన ధరలు భారీగా తగ్గుతాయి.

Petrol Prices
- దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలో మూడోసారి ఇంధన ధరలు పెరుగుదల నమోదు చేశాయి. గత 8 రోజుల్లో ఏకంగా మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధరలు మరోసారి పెరగ్గా.. దీంతో అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.99.51కి చేరుకుంది. అయితే శనివారం లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు కేంద్రం పెంచింది.
- తక్షణమే ధరలు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో లీటర్పై రూ.3 పెంచగా.. ఇప్పుడు మరోసారి పెంచడంతో ప్రజలపై భారం పడుతోంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ మేరకు జీఎస్టీ పరిధిలో చేర్చాలని వాణిజ్య, పారిశ్రామిక మండలి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ మండలి చైర్మన్ బ్రిజేష్ గోయల్ ప్రధాని మోదీ లేఖ రాశారు.
- ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బ్రిజేష్ గోయల్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ట్యాక్సులు విధిస్తున్నాయి. ఢిల్లీలో చూసుకుంటే మే 22వ తేదీ నాటికి పెట్రోల్ అసలు ధర రూ.66.29గా ఉండగా.. ఎక్సైజ్ సుంకం రూ.11.90, వ్యాట్ రూ.16.03, డీలర్ మార్జిన్ రూ.4.42గా ఉంది.
- పన్నులు, మార్జిన్లు కలిపి అదనంగా లీటర్ పెట్రోల్పై రూ.32 నుంచి రూ.33 వరకు ఉన్నాయి. ఇక డీజిల్ ధర రూ.67.36గా ఉండగా.. పన్నులు, మార్జిన్ కలిపి అదనంగా రూ.24గా ఉంది. పెట్రోల్, డీజిల్పై జీఎస్టీ విధిస్తే ఈ పన్నులన్నీ తొలగిపోతాయి. దీని వల్ల ఒక పన్ను మాత్రమే ఉంటుంది. జీఎస్టీ విధిస్తే కేంద్ర ప్రభుత్వ పన్ను, రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్లు తొలగిపోతాయి. దీంతో లీటర్ పెట్రోల్పై రూ.27.93 తగ్గుతుంది.
- పెట్రోల్ ధర రూ.66.29గా ఉండగా.. 18 శాతం జీఎస్టీ విధిస్తే మొత్తం పన్ను రూ.11.93 అవుతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.78.22కే లభిస్తుంది. అంటే ధర రూ.22 తగ్గుతుందన్నమాట. ఒకే దేశం-ఒకే పన్ను విధానాన్ని 2017లో జీఎస్టీ అమలు చేసినప్పుడు ప్రకటించారు. అయితే పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడం వల్లన ఒకే దేశం-ఒకే పన్ను అనే భావన దెబ్బతింటుంది. దీంతో పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ రద్దు చేసి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
Follow Us





