AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛార్జ్ షీట్ స్వరూపం మార్చిన లేడీ పోలీస్‌..! ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు..

దుండిగల్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప ప్రజల సౌలభ్యం కోసం తెలుగులో ఛార్జ్ షీట్లు, దర్యాప్తు నివేదికలు దాఖలు చేశారు. ఆంగ్ల భాషపై పట్టులేని వారికి న్యాయ ప్రక్రియలను సులువుగా అర్థం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ చర్యలు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాయి. ఆమె రెండు కేసులలో తెలుగులోనే పత్రాలు సమర్పించి, సైబర్ యోధురాలిగా గుర్తింపు పొందారు.

ఛార్జ్ షీట్ స్వరూపం మార్చిన లేడీ పోలీస్‌..! ప్రజలకు మరింత చేరువగా న్యాయ సేవలు..
Head Constable Swarupa
Jyothi Gadda
|

Updated on: Jan 07, 2026 | 11:41 AM

Share

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికార ప్రత్యుత్తరాలు అన్నీ ఇంగ్లీష్ లో జరగడం పరిపాటి. అటు గ్రామాల్లో ఇటు నగరంలో ఆంగ్ల భాష మీద పట్టులేని వాళ్లు ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నారు. అటువంటి వారు ప్రస్తుతం అందుబాటులో ఫోన్ ఉండటం వల్ల ఇంగ్లీషు లో ఉన్న సమాచార కాపీని ఫోటో లేదా స్కాన్ చేసి వారికి వచ్చిన భాషలోకి అనువదించుకుని చదువుకుని అర్థం చేసుకుంటారు. కానీ, దుండిగల్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ అధికారి మాతృభాష తెలుగులో తన దర్యాప్తును సాగించి స్థానికంగా చలామణిలో ఉన్న తెలుగు భాషలో అభియోగపత్రం దాఖలు చేయడం ద్వారా పోలీస్ శాఖలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు.

ఇలా ప్రజల మాతృభాషలో కార్యాలయ విధులు సాధారణంగా ఉత్తర భారతదేశంలో జరగడం మనం చూస్తుంటాం. కానీ దుండిగల్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో 2025 సంవత్సరంలో తనకు కేటాయించిన ఓ రెండు కేసుల్లో పూర్తిగా తెలుగులో అభియోగపత్రం కోర్టుకు దాఖలు చేసింది.

అందులో మొదటిది బౌరంపేట్ కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి సంబంధించినది. అతడు తన కిరాణా డబ్బాలో అక్రమంగా మద్యం నిల్వలు దాచి, అమ్మకాలు జరుపుతున్న క్రమంలో దుండిగల్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న కేసును ఎక్సైజ్ చట్టం ప్రకారం దర్యాప్తు పూర్తి చేశారు. చివరగా దాఖలు చేసే అభియోగ పత్రాలు పూర్తిగా తెలుగులో మేడ్చల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ కు సమర్పించారు.

ఇవి కూడా చదవండి

మరో కేసులో ఒక వలస కూలీ అయిన 35 సంవత్సరాల మహిళ తన కుమార్తె అయిన 4 సంవత్సరాల చిన్న పాపతో పాటు అర్ధరాత్రి సమయంలో ఆకస్మాత్తుగా ఎవరికీ కనిపించకుండా పోయింది. ఈ సందర్భంలో తన భార్య, కూతురి ఆచూకీ కనుగొనమని తన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వేగంగా స్పందించి కేసును ఛేదించి మహిళను, పాపను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో తన దర్యాప్తు తుది నివేదికను ఏసీపీ మేడ్చల్ శంకర్ రెడ్డి కి సమర్పించారు.

ఈ విధంగా ప్రజలకు సులువుగా అర్థమయ్యే విధంగా, తెలంగాణ రాష్ట్ర అధికార భాషల్లో ఒకటి అయిన తెలుగులో దర్యాప్తును పూర్తి చేయడం ద్వారా మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతున్నారు. అంతేకాదు.. ఇటీవల తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బంజారా హిల్స్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్., సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఐపీఎస్ తదితరుల సమక్షంలో 50 మంది పోలీస్ సిబ్బందికి ప్రశంసలు అందించారు. అందులో సైబర్ యోధుల్లో ఒకరిగా స్వరూప నిలిచారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us