Chevella Parliament: ఈసారి చేవెళ్ల పార్లమెంట్‎ బరిలో నిలిచేదెవరు.. గెలిచేదెవరు..?

వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు.. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలు.. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. పాతిక లక్షల మంది ఓటర్లున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం సాధించారు.

Chevella Parliament: ఈసారి చేవెళ్ల పార్లమెంట్‎ బరిలో నిలిచేదెవరు.. గెలిచేదెవరు..?
Chevella Parliament
Follow us

| Edited By: Srikar T

Updated on: Jan 05, 2024 | 9:23 PM

వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు.. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలు.. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. పాతిక లక్షల మంది ఓటర్లున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, 2019లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం సాధించారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో కొనసాగుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో పాగా వేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి.

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల కాంగ్రెస్, నాలుగు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. హైదరాబాద్ శివారులోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టిపోటి ఇచ్చింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ట్రై యాంగిల్ పైట్ ఉండనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీచేస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో తెలంగాణ భవన్‎లో బీఆర్ఎస్ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపుతారనేది ఆసక్తికరంగా మారింది.

బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‎లో చేరే ఆ కీలక నేతనే చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీలో దింపే ఛాన్స్ ఉంది. లేనిపక్షంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ల ఎంపీ ఎన్నికల ఇంఛార్జీగా స్వయంగా సీఎం రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఛాలెంజ్‎గా తీసుకుంటే బలమైన అభ్యర్థి బరిలోదించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరును అధిష్టానం దాదాపు ఫైనల్ చేసింది. గతంలో ఎంపీగా పనిచేయడంతో పాటు.. స్థానికంగా పట్టు ఉండటం.. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉండటం.. మోడీ ఛరిష్మా కలిసి వస్తుందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో మైనార్టీ ఓట్లు చాలా కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఎంఐఎం పార్టీ ప్రత్యేకంగా అభ్యర్థిని నిలబెడుతుందా? లేదంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పరోక్షంగా ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై మూడు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. చివరకు ఎవరి జెండా ఎగురుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..