Telangana: నిద్ర చేసేందుకు రాత్రి ఆలయానికి వెళ్లారు.. తెల్లారేసరికి తిరిగి ఇంటికి చేరుకోగా..
ఆలయానికి వెళ్లి నిద్ర చేసి వచ్చేసరికి ఇంటిని గుల్ల చేశారు దొంగలు. ఇంట్లో ఉన్న బంగారం, వెండితో పాటు నగదును అపహరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

జడ్చర్ల ప్రాంతంలో వరుస చోరీ ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. NH-44కి అనుకోని ఉన్న మల్లె బోయినపల్లిలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా రాత్రివేళ చొరబడి 5 తులాల బంగారం, కిలోన్నర వెండి, సుమారు రూ.70 వేల నగదు దోచుకెళ్లారు. ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని కొమ్ము శ్రీనివాస్ ఇటీవలే మరణించారు. దీంతో రాత్రి దేవాలయంలో నిద్రించాలని జడ్చర్ల పట్టణానికి వెళ్లారు.
కుటుంబ సభ్యులు అంతా ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. తెల్లవారి ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు విరగొట్టి ఉన్నాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా సైతం తెరిచి ఉంది. దీంతో చోరీ జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పలు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మిట్ట మధ్యాహ్నం జడ్చర్ల పట్టణంలో కిష్టారెడ్డి నగర్లో కిరాణా షాప్లో చైన్ స్నాచింగ్ ఘటన మరవక ముందే చోరీ జరగడంతో జడ్చర్ల ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పగలు, రాత్రి గస్తీ పెంచి ఇలాంటి చోరీ ఘటనలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
