Telangana: తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ప్రతీ ఒక్క మహిళకు.!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఒక్క మహిళ ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని.. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అదేంటో తెలుసుకోవాలంటే.. ఓ సారి ఈ స్టోరీ పై లుక్కేయండి మరి.

తెలంగాణలో ప్రజారోగ్య వ్యవస్థను గ్రామస్థాయి నుంచి నగరాల వరకు బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల సమగ్ర ఆరోగ్య ఉద్యమాన్ని ప్రకటించింది. మహిళలు, చిన్నారులు, వృద్ధులను కేంద్రీకరించి మార్చి 2 నుంచి జూన్ 9 వరకు హెల్త్ మిషన్–100 పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఈ మిషన్లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా సుమారు 30 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 42 లక్షల గ్రామీణ మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి, వారి ఆరోగ్య వివరాలను సమగ్రంగా నమోదు చేయనున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు, ఔషధాలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మార్చి నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గైనకాలజీ, పిల్లల వైద్యం, కంటి, ఎముకలు, దంత నిపుణులతో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. 33 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో వృద్ధుల కోసం ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. రక్తహీనత, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి ఐరన్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కంటి పరీక్షలు, టీకాలు, పోషకాహారం అందించనున్నారు.
ఏప్రిల్ తొలి పక్షంలో క్యాన్సర్ సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారించి, క్యాన్సర్ను నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించడం, రాష్ట్ర స్థాయి క్యాన్సర్ రిజిస్ట్రీ ఏర్పాటు, జిల్లా డే-కేర్ కేంద్రాల్లో కీమోథెరపీ సేవలను విస్తరించడం వంటి చర్యలు చేపడతారు. ఏప్రిల్ మధ్య నుంచి మే మధ్య వరకు టిబి కేసుల గుర్తింపు, డెంగ్యూ, వడదెబ్బ, అతిసారం వంటి సీజనల్ వ్యాధులపై విస్తృత స్క్రీనింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో వడదెబ్బ చికిత్స గదులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. మే 16 నుంచి జూన్ 9 వరకు పట్టణ పీహెచ్సీలను పాలీ క్లినిక్లుగా అప్గ్రేడ్ చేసి, ఐటీడీఏ ప్రాంతాల్లో సికిల్ సెల్, థలసీమియా స్క్రీనింగ్ కోసం మొబైల్ మెడికల్ యూనిట్లను ప్రవేశపెడతారు. పాఠశాలలు, హాస్టళ్లలో ఆహార భద్రత తనిఖీలు నిర్వహించి హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచనున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిషన్ పురోగతిని ప్రజల ముందుకు తీసుకువస్తారు. జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
