AP News: అక్వా రంగంపై ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన రొయ్యల ధర!
అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. భారత్పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగంపై కూడా కనిపిస్తోంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 26 శాతం సుంకాలు విధించడంతో ఏపీలోని ఆక్వారంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.

భారత్లో జరిగే రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి జరుగుతుంటే అందులో 70 శాతానికి పైగా ఏపీ నుంచే వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు చేపలు, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. అయితే ప్రధానంగా ఏపీలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 29శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి, మిగిలినవి చైనా, జపాన్, ఇతర గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు ప్రభావంతో ఏపీలో రొయ్యల రేట్లు భారీగా తగ్గిపోయాయి.
ముఖ్యంగా రొయ్యల సాగు అధికంగా జరిగే భీమవరం, తూర్పు గోదావరి వంటి ప్రాంతాల్లో కిలో రొయ్యల ధర 40 రూపాయలు పడిపోయింది. దీంతో ఆక్వారైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా సుంకాలను ప్రకారం చూసుకుంటే ఓ అక్వా రైతు లక్ష రూపాయల విలువ చేసే రొయ్యలను ఎగుమతి చేయాలంటే రూ.26,000 సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వయోలిన్ డ్యూటీని కలుపుకుంటే మొత్తం రూ.35 వేలకు పైగా కట్టాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్ ఖర్చులు అని ఇంకో 20వేల దాకా పెట్టాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా లక్ష రూపాయల్లో 50 శాతం వరకు ఈ పన్నులు, రవాణా ఖర్చులకే పోతోందని..తమకు మిగిలేదేమిలేదని రైతులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
