Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌లో ఏకమవుతున్న అధికార, విపక్ష పార్టీలు..

ఇజ్రాయెల్‌పై అతిపెద్ద మిలిటెంట్‌ దాడి జరగడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆ దేశంలోని ప్రభుత్వ ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యవసర జాతీయ సమైక్యతా ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై చర్చలు చేయడం ప్రారంభించాయి. అయితే తాజాగా హమాస్‌ దాడిలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Israel-Palestine conflict: ఇజ్రాయెల్‌లో ఏకమవుతున్న అధికార, విపక్ష పార్టీలు..
Israel Leaders
Follow us

|

Updated on: Oct 08, 2023 | 6:20 PM

ఇజ్రాయెల్‌పై అతిపెద్ద మిలిటెంట్‌ దాడి జరగడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆ దేశంలోని ప్రభుత్వ ప్రతిపక్షాలు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యవసర జాతీయ సమైక్యతా ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై చర్చలు చేయడం ప్రారంభించాయి. అయితే తాజాగా హమాస్‌ దాడిలో దాదాపు 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రతిపక్షనాయకులు యారీ లాపిడ్‌, బెన్నీ గాంట్జ్‌ మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు ప్రభుత్వంలో చేరే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మంత్రివర్గంలోని ఇద్దరిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. నెతన్యాహు ప్రభుత్వంలోని రాడికల్‌, అసమర్థ మంత్రివర్గం ఈ యుద్ధాన్ని తట్టుకోలేదని యారీ లాపిడ్‌ పేర్కొన్నారు. అత్యవసర జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లేతే.. ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు వెళతాయని యారీ లాపిడ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అలాగే.. ప్రజలు మొత్తం ఐడీఎఫ్‌, రక్షణ సంస్థలకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే నెతన్యాహు కూడా విపక్ష పార్టీలను ప్రభుత్వంలో చేర్చుకొనేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్‌ దాడులను ఆపడం లేదు. ఆదివారం సైతం స్డెరోట్‌ నగరంపై ఏకంగా 100 రాకెట్లను ప్రయోగించారు హమాస్ మిలిటెంట్లు. ఈ దాడుల్లో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే నిన్న జరిగిన దాడిలో హమాస్‌ మిలిటెంట్లు ఎంత మంది ఇజ్రాయెలీలను బందీలుగా పట్టుకున్నారో కచ్చితంగా తెలుసుకునేందుకు ఐడీఎఫ్‌ ప్రత్యేకంగా సిచ్యూవేషన్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది. హమాస్‌ గన్‌మెన్లు నిన్న భారీగా పిల్లలు, మహిళలు, పురుషులను ఈడ్చుకొని గాజాపట్టీలోకి తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

ఇప్పటికే ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలకు సుమారు ఎంత మంది బందీలుగా ఉన్న అంశంపై కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా.. కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలని భావిస్తోందని ఐడీఎఫ్‌ ప్రతినిధి కర్నల్‌ రిచర్డ్‌ హెక్ట్‌ పేర్కొన్నారు. అలాగే గాజాపట్టీలో భవిష్యత్తులో తీవ్రమైన దాడులు జరుగుతాయని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇందులో భాగంగానే గాజా సమీపంలోని ఉన్నటువంటి ఇజ్రాయెల్‌ వాసుల నివాస ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈజిప్టులోని ఇజ్రాయెల్ టూరిస్టులపై కూడా కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. మధ్యధరా సమీపంలో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా నగరంలో జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు పౌరులు అలాగే ఈజిప్టుకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.