Telangana: పెళ్లంటే ఇది కదా భయ్యా.! ఇలానే చేసుకోవాలి.. నలుగురికి ఆదర్శంగా
తన కళ్యాణ వేడుకలో ప్లాస్టిక్ వస్తువుల బదులుగా అరిటాకులో భోజనం, మట్టి గ్లాసులలో మంచి నీళ్లు, విస్తరాకులతో తయారు చేసిన బౌల్స్లో స్వీట్లు, మండపంలో ప్లాస్టిక్ కుర్చీల స్ధానంలో స్టీల్ కుర్చీలు, మండపం డెకరేషన్లో మొత్తం పచ్చి పూలు. ఇది మహబూబాబాద్లో జరిగిన ఓ పెళ్లి తంతు కహానీ.

పెళ్లి కొడుకు ప్రకృతి ప్రేమికుడు.. జాతీయ, జిల్లా స్ధాయి అవార్డులు అందుకోవడం.. ఎక్కడ పని చేసినా ఆ ఊరంతా ప్లాస్టిక్ రహిత ఊరుగా తీర్చిదిద్దడమే కాకుండా.. అతని వివాహంలో సైతం ఎక్కడా ప్లాస్టిక్ అనేది కనిపించకుండా వివాహం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఇదే కాకుండా తన వివాహ ఆహ్వన పత్రికలో సైతం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సందేశాన్ని ఇచ్చాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో వెన్నారం గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సంపత్ ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో ఓ ఫంక్షన్ హల్లో వివాహం జరుపుకున్నాడు.
తన వివాహ కార్యక్రమంలో ఎక్కడా ప్లాస్టిక్ కనిపించకుండా మొదటి నుంచి ప్రణాళిక బద్దంగా వివాహం పూర్తి చేశాడు. ఇందులో వింత ఏముందనుకుంటున్నారా.? సంపత్ పెండ్లి మండపంలో ఫ్లెక్సీల బదులు క్లాత్ బ్యానర్లు, ప్లాస్టిక్ కుర్చీల స్ధానంలో స్టీల్ కుర్చీలు, పెండ్లి మండపంలో ప్లాస్టిక్ పూలతో అలంకణ చేయకుండా పచ్చి పూలతో అలంకరణ, విందు సమయంలో విస్తరాకుల బదులు అరటి ఆకులు, అతి తక్కువ ధరలకు లభించే ప్లాస్టిక్ గ్లాసులను వాడకుండా కొంచెం ఖర్చు ఎక్కువైనా మట్టి గ్లాసులను ముందస్తుగానే తయారు చేయించారు.
ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్లాస్టిక్ వస్తువుల బదులు పర్యావరణానికి ముప్పు తలపెట్టకుండా ఉండే వాటిని మాత్రమే వాడారు. వీటిని చూసిన బంధువులు, స్నేహితులు సంపత్ను, అతని కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా వరుడు సంపత్ మాట్లాడుతూ.. తన కళ్యాణ మహోత్పవం సందర్భంగా తన ఇంటి పెరట్లో రెండు మొక్కలు సైతం నాటానని.. మరి మీరు కూడా తన వంతు పర్యావరణాన్ని కాపాడాలని వివాహానికి వచ్చిన అతిధులకు తెలియచేశాడు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి




