నవ్విందనీ విద్యార్థినిపైకి చెప్పు విసిరిన టీచర్.. తల్లిదండ్రుల దేహశుద్ధి! విద్యాశాఖ సస్పెన్షన్ వేటు
చదువు చెప్పి, సంస్కారం నేర్పవల్సిన ఓ ఉపాధ్యాయుడు కుసంస్కారిగా ప్రవర్తించాడు. ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రలు పాఠశాలపై దండెత్తి సందరు ఉపాధ్యాయుడిని చితకబాదారు. అంతేనా విద్యాశాఖకు ఫిర్యాదు అందడంతో.. దెబ్బకు సస్పెండ్ చేసిపారేసింది..

బల్మూర్, జనవరి 26: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవంతో కూడుకున్నది. నేటి విద్యార్థులను రేపటి ప్రయోజకులుగా మార్చే అత్యున్నత బాధ్యత. అలాంటి వృత్తికి ఎంతో మంది వన్నె తేగా… కొంతమంది కిచకపర్వాలతో చెడ్డ పేరు తెస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన మాస్టర్లు… వారిపై దాష్టీకానికి పాల్పడుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయిని దాష్టీకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న మధ్యాహ్నం గం.3.30నిమిషాలకు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభాత భేరీ పాటలు సాధన చేయిస్తున్నాడు. ఇంతలో అటు పక్కగా వెళ్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని నవ్విందని ఆగ్రహించాడు. వెంటనే కాలికి ఉన్న చెప్పును విద్యార్థిని పైకి విసిరాడు. అది కాస్త ఆ పక్కనే ఉన్న మరో విద్యార్థినికి తాకింది. అయితే ఆ చెప్పు అసలు విద్యార్థినిని తాక లేదని సదరు విద్యార్థినిని మళ్ళీ విచక్షణా రహితంగా బాదాడు. ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి కొట్టడంతో విద్యార్థినిలకు శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇక పాఠశాలలో జరిగిన విషయాన్ని విద్యార్థినిలు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఇవాళ ఉదయం పాఠశాలలోనే ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేశారు. పాఠశాలలో కాసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. గ్రామస్తులు జోక్యం చేసుకొని ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యయుడుని కలిసిన బాధ్యుడైనా టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఘటనపై ప్రధానోపాధ్యాయుడు విష్ణుమూర్తి స్పందించారు. విద్యార్థినిలు ఘటన విషయాన్ని తమ దృష్టికి తీసుకురాగానే శ్రీనివాస్ రెడ్డిని మందలించానని చెప్పారు. నిన్నా, ఇవాళ జరిగిన ఘటనలను విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం పంపినట్లు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.