Best train journeys: ఈ రైలు ప్రయాణాలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయ్!
జర్నీ చేయడానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా ట్రైన్ జర్నీ చాలా ప్రత్యేకం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. రైలు ప్రయాణం చేస్తూ కిటికీలోంచి ప్రకృతిని ఆస్వాదించడం.. ఒక గొప్ప అనుభూతి. ప్రయాణాలను, ప్రకృతిని ఇష్టపడే వాళ్లు జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన ట్రైన్ జర్నీ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ఎక్కడికైనా టూర్ వెళ్లాలంటే బస్సు, రైలు, కారు, విమానం ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ చాలామంది రైలునే ఇష్టపడతారు. పిల్లలే కాదు.. అదేంటో పెద్దవాళ్లు కూడా రైలెక్కగానే కిటికీలకు అతుక్కుపోతారు. కిటికీలోంచి ప్రకృతిని చూస్తూ మురిసిపోతారు. ముఖ్యంగా పర్వతాలు, లోయల మధ్య నుంచి రైలు వెళ్తున్నప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించాలే కానీ మాటల్లో చెప్పలేం. మనదేశంలో అలాంటి కొన్ని అందమైన రైలు మార్గాల గురించి తెలుసుకుందాం.
నీలగిరి మౌంటెన్ రైల్వే
తమిళనాడులోని నీలగిరి పర్వతాల్లో ఉన్న ఈ రైల్వే లైన్ 250 వంతెనలు, 108 వంపులు, 16 సొరంగాల గుండా పోతుంది. ఈ రైల్వేలైన్లో ఎటుచూసినా దట్టమైన అడవులు, మబ్బులను ముద్దాడే పర్వతాలు, లోయలు, జలపాతాల అందాలే కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ స్టీమ్ ఇంజిన్ రైళ్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇంజిన్ నుంచి వచ్చే ఆవిర్లు, పొగలు, చుక్చుక్ మంటూ వచ్చే ట్రైన్ శబ్దం సరి కొత్త ట్రైన్ జర్నీ అనుభూతినిస్తుంది. ఊటీకి హనీమూన్ కోసం వచ్చే కపుల్స్ ఈ రైల్వేలైన్లోనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. షారుక్ ఖాన్ ‘దిల్సే’ సినిమాలో ‘చల్ చయ్యా చయ్యా’ పాటను ఈ రైల్వేరూట్లోనే షూట్ చేశారు.
డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
పిల్లలు ఆడుకునే బొమ్మ రైళ్లు ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉంటాయి ఈ రూట్లో తిరిగే రైళ్లు. వీటిని ‘టాయ్ ట్రైన్స్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రైలు ప్రయాణాల్లో డార్జిలింగ్ టాయ్ ట్రైన్ ప్రయాణం కూడా ఒకటి. పశ్చిమ బెంగాల్లోని సిరిగులి నుంచి డార్జిలింగ్ వరకూ సుమారు 88 కిలోమీటర్ల దూరం ఈ రైలులో ప్రయాణించొచ్చు. ఈ రూట్కు యునెస్కో హెరిటేజ్ సైట్ హోదా కూడా ఉంది. రైలు మార్గమంతా పొగమంచుతో నిండిపోయి గాల్లో ప్రయాణిస్తున్న అనుభూతినిస్తుంది. ఇక్కడుండే ‘బటాసియా లూప్’ మార్గం ద్వారా హిమాలయాల్ని 360 డిగ్రీల కోణంలో రైల్లో తిరుగుతూ చూడొచ్చు.
డిజర్ట్ క్వీన్
పేరుకు తగ్గట్టుగానే ఇది ‘ఎడారి రాణి’. రాజస్తాన్లోని థార్ ఎడారి మీదుగా సాగిపోయే ఈ రైల్వేలైన్ జోధ్ పూర్ను, జైసల్మేర్ను కలుపుతుంది. మొదటిసారి ప్రయాణించే వాళ్లను ఈ రూట్ అబ్బురపరుస్తుంది. దారంతా ఎడారి, ఎటు చూసినా ఇసుకే కనబడుతుంది. మూడొందల కిలోమీటర్ల పొడవుండే ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే మధ్యలో చిన్నచిన్న గ్రామాలొస్తాయి. దారిపొడవునా రాజస్తానీలు, దూరంగా ఎడారిలో నడుచుకుంటూ వెళ్లే ఒంటెలు కనిపిస్తుంటాయి. రాజస్తాన్ అందాలు చూస్తూ, రాజస్తాన్ సంస్కృతిని తెలుసుకోవాలంటే.. ఈ ట్రైన్ జర్నీ చేయాల్సిందే.
పంబన్ బ్రిడ్జి
పంబన్ బ్రిడ్జి ఇండియాలో కట్టిన మొదటి సముద్రపు రైల్వే బ్రిడ్జి. దీన్ని పాక్ జలసంధి మీద.. పంబన్ ఐల్యాండ్కి, రామేశ్వరం సిటీకి మధ్యన కట్టారు. పెద్దపెద్ద ఓడలు, స్టీమర్లు వచ్చినప్పుడు బ్రిడ్జి రెండుగా విడిపోయి, పైకి లేవడం, అవి వెళ్ళగానే మళ్లీ మామూలు పొజిషన్కి రావడం ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. ఈ రూట్లో వెళ్తుంటే.. సముద్రంపై నావలో వెళ్లినట్టే అనిపిస్తుంది. తక్కువ ఎత్తులో కట్టిన బ్రిడ్జి అవ్వడం వల్ల అప్పుడప్పుడు రైలులోకి అలలు వచ్చి, తగులుతుంటాయి. రైలు ప్రయాణాలు ఇష్టపడేవాళ్లు పంబన్ బ్రిడ్జి మీదుగా కనీసం ఒక్కసారైనా ప్రయాణం చేయాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




