Andhra: అరె ఓ సాంబ.! అద్దిరిందిగా.. ఇకపై పెట్రోల్ బంక్ దగ్గర క్యూ కట్టాల్సిన పన్లేదు
ఈ యువకుడు ఐడియా అద్దిరిపోయింది. ఇకపై పెట్రోల్ కోసం మనం బంకుల దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం లేదు. ఎంత కావాలంటే.. అంత మన ఇంటికే సరాసరి వచ్చేస్తుంది. మరి ఇది ఎక్కడ జరిగింది.? ఏంటో.? ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

ఇప్పటి వరకూ మనం మొబైల్ టిఫిన్ సెంటర్లు.. మొబైల్ కూరగాయల మార్కెట్లు చూశాం. ఇప్పుడు కదిలే పెట్రోల్ బంక్ వచ్చేసింది. దీనిని చూసిన నెటిజన్లు.. ఈ ఐడియా ఏదో బావుందే.. ఇవే కనుక అందుబాటులోకి వస్తే.. ఇకపై పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం ఉండదంటున్నారు.
పెట్రోల్ బంక్ అంటే మంచి సెంటర్ చూసి అక్కడ ఏదొక ప్రాంతంలో బంక్ ఏర్పాటు చేస్తారు. వినియోగదారులంతా అక్కడికి వెళ్లి పెట్రోలు కొట్టించుకుంటారు. ఇకపై ఇలా పెట్రోలు బంకుల వద్దకు మనం వెళ్లక్కర్లేదనిపిస్తోంది. పెట్రోలు బంకే మనల్ని వెతుక్కుంటూ వచ్చే రోజులు రాబోతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. అవును, ఇదిగో కదిలే పెట్రోల్ బంక్ వచ్చేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి పరిధిలోని నరవాడకు చెందిన ఓ వ్యక్తి.. ఓ మినీ ట్యాంకర్ను కొనుగోలు చేసి, అందులోనే పెట్రోల్ పంపింగ్, రీడింగ్ యంత్రాలు అమర్చుకున్నారు. పరిశ్రమలు, వివిధ సంస్థల వద్దకు వాహనంతో వెళ్లి అవసరమైన పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నారు.
ఈ మినీ వ్యాన్ ట్యాంకర్ సామర్థ్యం 3,000 లీటర్లు. రిలయన్స్ సంస్థ కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామ పరిధిలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకుగాను పెద్ద సంఖ్యలో ఇక్కడ పొక్లెయిన్లు, జేసీబీలు, లారీలు, ట్రాక్టర్లతో పనులు చేస్తున్నారు. ఆయా వాహనాలకు అవసరమైన ఇంధనాన్ని కదిలే బంకు ద్వారా సరఫరా చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
