ఆంధ్రా,ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి టెర్రర్…
గండాహతి పంచాయితీ పరిధిలోని సంతోష్ పూర్ గ్రామానికి చెందిన పింటూ నాయక్ అనే గ్రామస్తుడికి చెందిన ఆవు కళేబరం బుధవారం గ్రామ శివారులోని కొండవద్ద లభ్యమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది సమీప ప్రాంతాన్ని పరిశీలించగా ఓ జంతువు పాద ముద్రలను గుర్తించారు. పాదముద్రలను ఫోటోలు తీసి భువనేశ్వర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపగా అవి పెద్ద పులి పాద ముద్రలని గుర్తించారు.

ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దు ప్రాంత ప్రజలను పెద్దపులి భయం వెంటాడుతోంది. ఒరిస్సాలోని గజపతి జిల్లా రాయగడ సమితి గండాహతి పంచాయితీ పరిధిలో ట్రాప్ కెమెరాలకు పెద్దపులి ఫోటోలు చిక్కాయి. దీంతో అటు ఒరిస్సా వాసులతో పాటు ఇటు శ్రీకాకుళం జిల్లాలోని సరిహద్దు మండలాల ప్రజలు గజగజ వణుకుతున్నారు. గండాహతి పంచాయితీ పరిధిలోని సంతోష్ పూర్ గ్రామానికి చెందిన పింటూ నాయక్ అనే గ్రామస్తుడికి చెందిన ఆవు కళేబరం బుధవారం గ్రామ శివారులోని కొండవద్ద లభ్యమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది సమీప ప్రాంతాన్ని పరిశీలించగా ఓ జంతువు పాద ముద్రలను గుర్తించారు. పాదముద్రలను ఫోటోలు తీసి భువనేశ్వర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపగా అవి పెద్ద పులి పాద ముద్రలని గుర్తించారు. దాంతో అప్రమత్తం అయిన అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలను అలెర్ట్ చేశారు. పాదముద్రలు గుర్తించిన ప్రాంతాలలో ఐదు ట్రాప్ కెమెరాలను అమర్చగా రెండు కెమెరాలలో పెద్ద పులి సంచారం స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. పెద్ద పులి ఏడు అడుగుల పొడవు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలెవరూ ఒంటరిగా సంచరించవద్దని, పెంపుడు జంతువులను శివారు ప్రాంతాలకు విడిచిపెట్టవద్దని హెచ్చరిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా గండాహతి జలపాతానికి వెళ్లే సందర్శకులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఒడిస్సా అటవీశాఖ అధికారులు తెలిపారు. పలు బృందాలుగా ఏర్పడి పెద్ద పులి జాడను ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతం గొప్పిలి నుంచి గారబంద వెళ్లే సరిహద్దు ప్రాంతాలవాసులకు పెద్దపులి సంచారంపై సమాచారం ఇచ్చి అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తం చేశారు.
ఈ పెద్దపులి గతంలో శ్రీకాకుళం జిల్లాలో సంచరించిందేనా…?
విజయనగరం,పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా వచ్చిన పెద్దపులి గత కొద్ది రోజుల వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోనే తిష్ట వేసింది. జిల్లాలోని సీతంపేట, భామిని, కొత్తూరు, మెలియాపుట్టి ,L.N. పేట, సరుబుజ్జిలి మండలాల్లో సంచరిస్తూ స్థానికులను గడగడలాడించింది. ఎక్కడ మనుషులపై దాడి చేసిన దాఖలాలు లేనప్పటికీ ఆవులు, మేకలు, గొర్రెలు, పెంపుడు జంతువులను మట్టు బెడుతూ భయబ్రాంతులకు గురిచేసింది. అయితే గత కొద్ది రోజులుగా పెద్దపులి జాడ జిల్లాలో పెద్దగా కనిపించలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారనగా తిరిగి ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోనే సంచరిస్తుందన్న సమాచారoతో శ్రీకాకుళం జిల్లాలోని సరిహద్దు మండలాలు అయిన పలాస, మెలియాపుట్టి మండలాల వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఒరిస్సా నుండి పెద్దపులి తిరిగి శ్రీకాకుళం జిల్లాలోకి చొరబడితే పరిస్థితి ఏంటి అంటూ తలచుకుని ఆందోళన చెందుతున్నారు. అలా జరగకుండా జిల్లా అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటున్నారు. తమకు తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
