BCCI Awards : క్రికెట్ పండుగకు వేళాయే.. రేపు ఢిల్లీలో నమన్ అవార్డుల జాతర..వేడుకల్లో యువ కెరటాల సందడి
BCCI Awards : బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 లో శుభ్మన్ గిల్, స్మృతి మంధానలు బెస్ట్ క్రికెటర్లుగా ఎంపికయ్యారు. ఐదు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను మార్చి 15న ఢిల్లీలో గౌరవించనున్నారు.ఇప్పటికే విజేతల జాబితా ఖరారు కావడంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

BCCI Awards : భారత క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నమన్ (NAMAN) అవార్డుల సందడి మొదలైంది. 2026 సంవత్సరానికి గాను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఈ వేడుకను మార్చి 15న న్యూఢిల్లీలో అట్టహాసంగా నిర్వహించనుంది. గడిచిన ఏడాది కాలంలో అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లను, కోచ్లను, అంపైర్లను ఈ వేదికపై గౌరవించనున్నారు. ఇప్పటికే విజేతల జాబితా ఖరారు కావడంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఈసారి పురుషుల విభాగంలో టీమిండియా స్టార్ బ్యాటర్, కెప్టెన్ శుభ్మన్ గిల్కు అత్యున్నత పాలీ ఉమ్రీగర్ అవార్డు దక్కనుంది. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా గిల్ ఈ అవార్డును అందుకోవడం ఇది వరుసగా రెండోసారి కావడం విశేషం. ఇక మహిళల విభాగంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును గెలుచుకుంది. ఆమె కెరీర్లో ఈ గౌరవం దక్కడం ఇది ఐదోసారి. వీరిద్దరి నిలకడైన ఆటతీరుకు బీసీసీఐ ఈ అరుదైన గుర్తింపును ఇచ్చింది.
దేశవాళీ (డొమెస్టిక్) క్రికెట్లో రాణించిన వారికి కూడా బీసీసీఐ పెద్దపీట వేసింది. ముంబైకి చెందిన ఈరా జాదవ్ ఉత్తమ మహిళా క్రికెటర్గా జగ్మోహన్ దాల్మియా ట్రోఫీని అందుకోనుండగా, హర్యానా తుపాను షెఫాలీ వర్మ సీనియర్ వన్డేల్లో తన మెరుపులకు గాను ఇదే ట్రోఫీని గెలుచుకుంది. ముంబై యువ కెరటం ఆయుష్ మ్హాత్రే, విదర్భకు చెందిన హర్ష్ దూబేలు లాలా అమర్నాథ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, నాలుగు ట్రోఫీలు గెలిచి దేశవాళీ క్రికెట్లో రారాజుగా నిలిచిన ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA)కు బెస్ట్ పెర్ఫార్మింగ్ అసోసియేషన్ అవార్డు దక్కనుంది.
🚨 News 🚨
BCCI to honour Roger Binny, Rahul Dravid and Mithali Raj with Lifetime Achievement Awards at Naman Awards 2026, scheduled to be held on Sunday, 15 March 2026, in New Delhi.
More details ▶️ https://t.co/noBSDbxcW5 pic.twitter.com/WfhfqHBuiI
— BCCI (@BCCI) March 14, 2026
అయితే, ఈసారి వేడుకలో హైలైట్ ఏమిటంటే.. ఒకే వేదికపై ఐదు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను సన్మానించడం. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచిన సీనియర్ పురుషుల జట్టుతో పాటు, 2025 వరల్డ్ కప్ నెగ్గిన మహిళల జట్టు, అండర్-19 విభాగాల్లో ప్రపంచ విజేతలుగా నిలిచిన యువ జట్లను బీసీసీఐ ఒకేసారి గౌరవించనుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇలా ఐదు ప్రపంచ స్థాయి ట్రోఫీ విజేతలను ఒకేసారి సన్మానించడం ఇదే తొలిసారి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
