AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena Ticket: జనసేన అధినేత చెంతకు టీడీపీ వర్గ పోరు.. పార్టీ మారితే టికెట్ దక్కేనా..?

టికెట్ కోసం నియోజకవర్గ ఆశావాహ నేతలు చేస్తోన్న రాజకీయ వ్యూహాలు రక్తి కట్టిస్తున్నాయి. అసలు సిసలైన అవకాశవాద రాజకీయాన్ని చూపిస్తున్నాయి. మొన్నటి వరకు టికెట్ కోసం టీడీపీలో ఉండి గ్రూపులు కట్టి.. జనసేనకు టికెట్ ఇస్తున్నారని తెలిసి ఇపుడు అదే నేతలు జనసేన అధినేతకు టచ్ లోకి వెల్లారట.

Janasena Ticket: జనసేన అధినేత చెంతకు టీడీపీ వర్గ పోరు.. పార్టీ మారితే టికెట్ దక్కేనా..?
TDP Janasena Manifesto
S Srinivasa Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Mar 29, 2024 | 1:53 PM

Share

తెలుగుదేశం పార్టీ పోయి జనసేనకు టిక్కెట్టు వచ్చే డాం డాం డాం…. జనసేనలోకి టీడీపి నాయకులొచ్చే డాం డాం డాం.. జనసేన టికెట్ ఎవరికి దక్కే డాం డాం డాం.. మాకంటే మాకంటూ నేతలు క్యూ కడుతున్నారు నేతలు. ఇది పాలకొండ నియోజకవర్గ కూటమిలోని తాజా పరిస్థితి. టికెట్ కోసం నియోజకవర్గ ఆశావాహ నేతలు చేస్తోన్న రాజకీయ వ్యూహాలు రక్తి కట్టిస్తున్నాయి. అసలు సిసలైన అవకాశవాద రాజకీయాన్ని చూపిస్తున్నాయి. మొన్నటి వరకు టికెట్ కోసం టీడీపీలో ఉండి గ్రూపులు కట్టి.. జనసేనకు టికెట్ ఇస్తున్నారని తెలిసి ఇపుడు అదే నేతలు జనసేన అధినేతకు టచ్ లోకి వెల్లారట. టికెట్ ఇస్తానంటే జనసేనలో జాయిన్ అయ్యి మీ అభ్యర్ధిగా మీ ముందు ఉంటామంటూ ఆఫర్ ఇచ్చారట.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలోని ST రిజర్వుడు స్థానమైన పాలకొండలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి 2014, 2019లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మరోసా ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని తహతహ లాడుతున్నారు. అటు కూటమి వైపు మాత్రం అభ్యర్థి ఎవరు అనేదే ఇంకా తేలలేదు. పైగా కూటమి అభ్యర్ధి ఎంపిక విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు, రోజుకో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

పాలకొండ నియోజకవర్గంలో ముందు నుంచి YCP వర్సెస్ TDP మధ్య ప్రధాన పోరు కొనసాగుతూ వచ్చింది. అదే సమయంలో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన జయకృష్ణకు స్వపక్షంలో విపక్షంలా సొంత పార్టీ నాయకుల అసమ్మతి పోరు నెలకొంది. జయకృష్ణ నాయకత్వాన్ని కాదంటూ పార్టీలోని ఓ వర్గం సామాజిక కార్యకర్తగా ఉన్న పడాల భూదేవిని ప్రోత్సహిస్తూ వచ్చింది. టీడీపీ టికెట్‌ను ఆశిస్తూ భూదేవి నియోజకవర్గంలో జయకృష్ణకి పోటీగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలు చేపడుతు వచ్చారు. జయకృష్ణకి టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అనుచరుడుగా పేరుండగా.. భూదేవికి అచ్చెన్నాయుడు ప్రోత్సాహం ఉన్నట్లు సమాచారం.

అయితే ఇవన్నీ కుటుంబ సమస్యలనిచ ఎన్నికల సమయానికి అధిష్టానం కలుగజేసుకుని అసమ్మతిని సద్దుమనిగిస్తాదని జయకృష్ణ ముందు నుంచి ధీమాగా ఉన్నారు. చివరకది అసలుకే ఎసరు పెట్టింది. కళా వెంకట్రావు అనుచరుడైన జయకృష్ణకు చెక్ పెట్టాలన్న అలోచనో లేదా నిజంగా టీడీపీ అధిష్టానం అలోచనో తెలియదు గానీ పొత్తులో భాగంగా అనూహ్యంగా పాలకొండ సీటు జనసేనకు కేటాయించేశారు.

పాలకొండ సీటు జనసేనకు కేటాయించటంతో టీడీపీలోని నిమ్మక జయకృష్ణకి, పడాల భూదేవికి చెక్ పడిందని అంతా భావించారు. ఇక ముందు నుంచి జనసేనలో ఉన్న SBI మాజీ ఉద్యోగి నాగేశ్వరావుకు ఆపార్టీ టికెట్ వరిస్తుందని భావించారు. అధిష్టానం కూడా నాగేశ్వరరావును విజయవాడకి పిలిచి అతని ఆర్థిక పరిస్థితి, ఎన్నికల్లో పోటీకి దిగితే తట్టుకునే సామర్థ్యంపై చర్చించారట. అయితే ఇంతలోనే తాజాగా మరిన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఎలాగైనా ఎమ్మెల్యే సీటు దక్కించుకోవాలని భావించిన పడాల భూదేవి తన వర్గం నేతలతో కలిసి మూడు రోజుల క్రిందట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. పార్టీలో చేరుతానని పాలకొండ జనసేన టికెట్ తనకు ఇవ్వాలని మనసులోని మాటను చెప్పారట.

అయితే ఆ విషయం తెలిసిన నిమ్మక జయకృష్ణ బుధవారం తన అనుచరులతో కలిసి పవన్ కళ్యాణ్ ను కలిశారు. తన వర్గంతో తాను జనసేనలో చేరుతానని తనకు గాని తాను ప్రపోజ్ చేసిన వ్యక్తికి గాని టికెట్ ఇవ్వాలని కోరారట. ఇరు వర్గాలు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం అవ్వగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కండిషన్ పెట్టారట. టీడీపీలోని ఇరు వర్గాలను జసేనలోకి చేర్చుకుంటే అది పొత్తు ధర్మానికి విరుద్ధమని భావించి ఇద్దరు వ్యక్తులపైన సర్వే నిర్వహించి దాని ఫలితాలు ఆధారంగా ఓ వర్గాన్ని జనసేనలోకి చేర్చుకొని వారికే టికెట్ కేటాయిస్తానని చెప్పారట పవన్.

అది మొదలు అటు పడాల భూదేవి, ఇటు నిమ్మక జయకృష్ణ వర్గాలు ఎవరికి వారే జనసేన టికెట్ నాదంటే నాది అంటూ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారట. దీంతో ఎంతవరకు టీడీపీలో ఉన్న గ్రూపులు పంచాయతీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచకు వచ్చి చేరిందట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎటువంటి కంక్లూజన్ ఇస్తారో చూడాలి..! ఇదిలా ఉంటే ముందు నుంచి పార్టీలో ఉన్న జన సైనికులను పక్కకు నెట్టేసారన్న వాదన వినిపిస్తోంది. రాజకీయాలలో పార్టీ జెండాలు మోసే వారి కంటే, జెండాలు మార్చే వారికే విలువ ఉంటుందని గుసగుసలాడుకుంటున్నారట..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…