Andhra Pradesh: సవరణలతో మళ్లీ నోటిఫికేషన్.. టీచర్ల బదిలీలపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ..
ఉపాధ్యాయ సంఘాలతో నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. బదిలీల నుంచీ సిలబస్ వరకూ అన్నీ చర్చించారు.. విద్యార్ధులు, ఉపాధ్యాయులకు ట్యాబ్ లు ఇవ్వడం పై కూడా నిర్ణయం తీసుకున్నారు.. బదిలీల విషయంలో సుమారు మూడు గంటల సుదీర్ఘ చర్చ చేసారు.
టీచర్ల సమస్యలపై దృష్టిపెట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ. వారి అవసరాలు, చేయాల్సిన సవరణల మీద నాలుగున్నర గంటల పాటు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వెయ్యి స్కూళ్ళలో సీబీఎస్ఈ ప్రారంభిస్తామన్నారు మంత్రి. ఎన్సిఆర్టీ పుస్తకాలను ఇకపై వినియోగిస్తామని.. తద్వారా సీబీఎస్ఈ కి పనికొచ్చే నాణ్యమైన సిలబస్ విద్యార్ధులకు అందిస్తామన్నారు. టీచర్ల బదిలీల పై కూడా చర్చించాం.. బదిలీలలో సవరణలు చేస్తామని, అందులో నాలుగైదు సవరణలు సూచించారని మంత్రి తెలిపారు. ఒక రోజు వ్యవధిలోనే బదిలీలపై సవరణలతో ప్రకటన చేస్తామని మంత్రి బొత్స తెలిపారు.
ఈ బదిలీలలో ఎవరూ నష్టపోరంటూ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. 8వ తరగతి చదివే విద్యార్ధులకు ట్యాబ్ లు ఇస్తామన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లి హైస్కూల్ లో, ఈనెల 21న 5.6 లక్షల మంది విద్యార్ధులకు 59 వేల మంది టీచర్లకు 686 కోట్ల తో సీఎం జగన్ చేతుల మీదుగ ట్యాబ్ ల పంపిణీ చేస్తామన్నారు.
ఇక డిజిటల్ విద్యకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఎస్టీయూ రాష్ట్ర అద్యక్షుడు సాయి శ్రీనివాస్. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకి స్మార్ట్ టీవీల ద్వార భోదనను స్వాగతిస్తున్నామన్నారు. బదిలీలకి అప్లై చేయడానికి మరో నాలుగు రోజులు సమయం కోరామని తెలిపారు. కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా బదిలీలు చేయాలని కోరామన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..