CM Jagan: జూన్ 4న విశాఖలోనే ముఖ్యమత్రిగా ప్రమాణస్వీకారం.. డేట్ ఫిక్స్ చేసిన జగన్!
ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కూటమిపై ఫైర్ అయ్యారు. కొనసాగుతున్న పథకాలను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదులుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి రాష్ట్రానికి ఇచ్చే హామీ ఏంటని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కూటమిపై ఫైర్ అయ్యారు. కొనసాగుతున్న పథకాలను కూడా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదులుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి రాష్ట్రానికి ఇచ్చే హామీ ఏంటని ప్రశ్నించారు.
తనను గద్దె దింపేందుకు చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో కలిసి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలన్నారు సీఎం జగన్. ఈసారి ఎన్నికలు ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయని, జగన్ కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు అని స్పష్టం చేశారు. మొదట తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడమే తప్ప జరిగేదేమీ ఉండదని, చంద్రబాబు గత చరిత్రను చూస్తే ఇది స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. టీడీపీపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. సైకిల్ బాగా తుప్పు పట్టిపోయిందని, అందుకే ఢిల్లీ నుంచి మెకానిక్లను పిలిపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పూర్తిగా డ్యామేజ్ అయిన సైకిల్ను తాము బాగు చేయలేమని ఢిల్లీ మెకానిక్లు తేల్చి చెప్పారన్నారు. దీంతో చంద్రబాబు బెల్ కొట్టడం మొదలుపెట్టాడని, ఆ బెల్ పేరే మేనిఫెస్టో అని విమర్శించారు.
ఆ తరువాత ఇచ్చాపురంలో జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎంతో చేశామని తెలిపారు. మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా మార్చామని అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేశామని గుర్తు చేశారు. జూన్ 4న విశాఖలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. దశాబ్ధాలుగా ఉన్న ఉద్దానం సమస్యను పరిష్కరించామని.. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు కడుతున్నామని తెలిపారు.
చివరి రెండు నెలలు పెన్షన్ ఇంటికి రాకపోతే ఏం జరిగిందో ప్రజలకు అర్థం కాదా ? అని జగన్ కామెంట్ చేశారు. ఓటు అనే ఆయుధంతో ప్రజలు కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కూడా కదులుతుందన్నారు. చంద్రబాబు ఓటుకు నాలుగైదు వేల రూపాయల వరకు ఇస్తారని, ఆ డబ్బును తీసుకోవాలని తెలిపారు. అయితే మంచి చేసిన వారికే ఓటు వేయాలని ప్రజలను కోరారు.
ఆ తరువాత గాజువాకలో జరిగిన సభలో పాల్గొన్న సీఎం జగన్.. కూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబుపై మోదీ అనేక విమర్శలు చేశారని.. ఇప్పుడు తన కూటమిలో చేరిపోయేసరికి ఆయనను పొగుడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్రానికి ఇచ్చే హామీ ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారా లేక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరపబోమని హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. జగన్ ఒప్పుకోలేదు కాబట్టే ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదన్నారు. గాజువాకలో టీడీపీ గెలిస్తే.. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు.
జగన్ హయాంలో అభివృద్ధి జరగలేదని చంద్రబాబు అనడాన్ని తప్పుబట్టారు సీఎం జగన్. గత 59 నెలల్లో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నామన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చి ప్రజలకు పరిపాలనను చేరువ చేశామని గుర్తు చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, కొత్తగా నిర్మిస్తున్న ఓడ రేవులు, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి అభివృద్ధి కాదా ? అని ప్రశ్నించారు. గత చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి 33 వేల కోట్ల పెట్టుబడులు వస్తే.. వైసీపీ హయాంలో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఈ విషయాలు ప్రజలు ఆలోచించాలని కోరారు. సీఎం జగన్ సభలకు జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…