Tollywood : నానికి ఇప్పుడున్న ఫేమ్కు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది.. డైరెక్టర్ కామెంట్స్..
న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి సైతం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నారు. విడుదలకు ముందు ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. అలాగే ఈ సినిమా నుంచి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

డైరెక్టర్ తాతినేని సత్య తన సినీ ప్రయాణం, కీలక చిత్రాలు, తన కొత్త చిత్రం సతీ లీలావతి గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు తాతినేని ప్రకాష్ రావు మనవడిగా, అలాగే సినీ రంగంలో తన తండ్రి రికార్డులు సృష్టించిన వ్యక్తి కుమారుడిగా ఉన్నప్పటికీ, సత్య ఎప్పుడూ తన కుటుంబ పేరును సినిమా కెరీర్ కోసం ఉపయోగించుకోలేదని స్పష్టం చేశారు. చెన్నైలో 31 సంవత్సరాలు నివసించిన సత్య, 2012-13లో హైదరాబాద్ కు మారాక సినిమా పరిశ్రమలో తన పోరాటం మొదలైందని వివరించారు. “నెవర్ యూజ్డ్ తాతగారి పేరో, లేకపోతే నాన్నగారి పేరో ఎప్పుడూ యూజ్ చేయలేదు. బట్ ఐ వాంటెడ్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్, తక్కువ ఫిల్మ్స్ అయినా మంచి ఫిల్మ్స్ తీద్దాం అనే ఒక ఇది పోరాటం” అని ఆయన తన అన్నారు. డేవిడ్ ధావన్ తో 8 హిందీ చిత్రాలకు, కమల్ హాసన్ నటించిన వసూల్ రాజా ఎంబిబిఎస్కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందన్నారు.
తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన భీమిలీ కబడ్డీ జట్టు సినిమాను దర్శకుడు ఓ మైలురాయిగా భావిస్తారు. ఆ చిత్రం నానిని హీరోగా పరిచయం చేసిన రెండో సినిమా. ఆ సమయంలో నాని కొత్త నటుడు కావడంతో, సినిమాకు తొలిరోజు పెద్ద ఓపెనింగ్స్ రాలేదని, కేవలం మౌత్ పబ్లిసిటీతోనే విజయవంతం అయిందని సత్య గుర్తుచేసుకున్నారు. “పిక్చర్ బాగుందిరా, వెళ్లి చూడొచ్చు” అనే ప్రశంసలతో సినిమా జనాల్లోకి వెళ్లిందని ఆయన అన్నారు. సినిమా విడుదలైన 16 సంవత్సరాల తర్వాత కూడా ప్రేక్షకులు భీమ్లీ కబడ్డీ జట్టును గుర్తుంచుకోవడం గొప్ప విజయమని, ఇది ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకుపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. క్లైమాక్స్ లో నాని పాత్ర మరణించిన తీరు ఆంధ్ర ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, నైజాంలో మాత్రం కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారని సత్య తెలిపారు. అయితే, భీమ్లీ కబడ్డీ జట్టు మొత్తం మీద మంచి విజయం సాధించిందని ఆయన పేర్కొన్నారు.
నాని ఇమేజ్ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడున్న నాని ఇమేజ్ కు భీమిలీ కబడ్డీ జట్టు సినిమా విడుదలై ఉంటే, మరింత పెద్ద హిట్ అయ్యేదని ఆయన అన్నారు. నాని తన కెరీర్ లో భీమిలీ కబడ్డీ జట్టును తనకిష్టమైన చిత్రాలలో ఒకటిగా ఇప్పటికీ పేర్కొంటారని సత్య వెల్లడించారు. సత్య దర్శకత్వం వహించిన ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) కూడా విజయవంతమైంది. ఈ చిత్రంతో రెజీనా కసాండ్రా, మహేష్ బాబు కుటుంబం నుండి వచ్చిన హీరో సైమా అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెలుచుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
