AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో విషాదం.. ఇంటర్ పరీక్షల్లో తప్పామని 9 మంది విద్యార్థులు ఆత్మహత్య

పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని.. మార్కులు తక్కువగా వచ్చాయని ప్రతి ఏటా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పడు తాజాగా ఏపీలోని ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

ఏపీలో విషాదం.. ఇంటర్ పరీక్షల్లో తప్పామని 9 మంది విద్యార్థులు ఆత్మహత్య
Death
Aravind B
|

Updated on: Apr 28, 2023 | 7:08 AM

Share

పదవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేదని.. మార్కులు తక్కువగా వచ్చాయని ప్రతి ఏటా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పడు తాజాగా ఏపీలోని ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షల్లో పాస్ కాలేదని.. మార్కులు తక్కువ వచ్చాయని వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు బలవన్మరణానికి యత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన విద్యార్థిని అనూష(17) ఇంటర్‌లో ఉత్తీర్ణత కావడంతో మనస్తాపం చెంది గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అనూష ఇటీవల కర్ణాటకలోని తన అమ్మమ్మ ఊరికి వెళ్లింది. బుధవారం విద్యార్థిని తల్లి ఫోన్‌ చేసి ఒక సబ్జెక్టులో తప్పినట్లు ఆమెకు తెలిపింది. రెండు రోజుల్లో వచ్చి పరీక్ష ఫీజు కట్టి ఈసారి ఉత్తీర్ణత సాధిస్తానని తల్లితో చెప్పింది. కానీ ఉదయం కుమార్తె మరణవార్త వినడంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు కర్ణాటకకు వెళ్లి కన్నీరమున్నీరయ్యారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాబు(17) ఇంటర్‌ ఎంపీసీ సెకండ్ ఈయర్‌లో గణితం సబ్జెక్టులో ఉత్తీర్ణత కాలేదు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంటర్‌ ఫస్ట్ ఈయర్‌లో తక్కువ మార్కులు వచ్చాయనే ఆవేదనతో అనకాపల్లికి చెందిన కరుబోతు రామారావు, అప్పలరమణ దంపతుల చిన్నకుమారుడు కరుబోతు తులసీ కిరణ్‌(17) గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలో తప్పానని మనస్తాపానికి గురైన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్‌(17).. టెక్కలిలో గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. విశాఖపట్నానికి చెందిన ఆత్మకూరు అఖిలశ్రీ(16) ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపంతో గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కూలి పనులు చేస్తూ కుమార్తెను చదివిస్తోంది. మృతదేహాన్ని గోప్యంగా శ్మశాన వాటికకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకొని శవపరీక్ష నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విశాఖ నగరంలోని పల్నాటి కాలనీ శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న బోనెల జగదీష్‌(18) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఒక సబ్జెక్ట్‌‌లో ఉత్తీర్ణత కాకపోవడంత మనస్తాపానికి గురై గురువారం ఉదయం గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని హనకనహాళ్‌ గ్రామానికి చెందిన మహేష్‌(17) ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. బుధవారం ఫలితాలు విడుదల కావడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామకు చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి షేక్‌ జాన్‌ సైదా(16)కు గణితంలో ఒక్కొక్కటి, ఫిజిక్స్‌లో ఆరు, కెమిస్ట్రీలో ఏడు మార్కులు రావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో గురువారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ కుమారుడి పరీక్ష పత్రాల మూల్యాంకనం సరిగా చేయలేదని, అతని మరణానికి అధికారులే బాధ్యత వహించాలని ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. అదే జిల్లాలోని చిల్లకల్లుకు చెందిన విద్యార్థి రమణ రాఘవ సీనియర్‌ ఇంటర్‌లో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత కాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఈయర్, సెకండ్ ఈయర్ కలిపి మూడు సబ్జెక్టులు తప్పాడు. మనస్తాపానికి గురైన అతను పురుగు మందు తాగాడు. బంధు మిత్రులు ఆస్పత్రికి తరలించారు. అదే జిల్లా రాజాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి పరీక్షల్లో ఫెయిలయ్యానని గురువారం చీమల మందు తాగడంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..