AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chernobyl Disaster: ఘోర ప్రమాదానికి వేదిక.. వీపరీతమైన అణుధార్మికత.. ఇపుడు సుందర పర్యాటక ప్రదేశం

శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొనసాగుతున్న ప్రయోగాలు, పరిణామాల విషయంలో యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన దారుణ ఉదంతం జరిగి...

Chernobyl Disaster: ఘోర ప్రమాదానికి వేదిక.. వీపరీతమైన అణుధార్మికత.. ఇపుడు సుందర పర్యాటక ప్రదేశం
Chernobyl Disaster
Rajesh Sharma
|

Updated on: Apr 26, 2021 | 6:34 PM

Share

CHERNOBYL DISASTER COMPLETES 35 YEARS: శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొనసాగుతున్న ప్రయోగాలు, పరిణామాల విషయంలో యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన దారుణ ఉదంతం జరిగి 35 సంవత్సరాలు అవుతోంది. న్యూక్లియిర్ పరీక్ష (NUCLEAR TEST) విఫలమై భారీ పేలుడుతో వందకు పైగా మనుషుల ప్రాణాలను హరించిన ఆ ప్రాంతం ఇపుడు 35 ఏళ్ళ తర్వాత మళ్ళీ పచ్చగా చిగురిస్తోంది. పర్యాటక ప్రదేశంగా ప్రపంచ ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది. ఎస్.. అదే చెర్నోబిల్ (CHERNOBYL). ఒకనాటి సోవియట్ యూనియన్‌ (SOVIET UNION)లో అంతర్భాగం.. ప్రస్తుతం ఉక్రెయిన్ (UKRAINE) దేశ ఉత్తర ప్రాంత పర్యాటన ప్రదేశం చెర్నోబిల్. చెర్నోబిల్ అణు విస్పోటం జరిగి ఏప్రిల్ 26 నాటికి సరిగ్గా 35 సంవత్సరాలు. అయితేనేం ఆనాటి వార్తలను చదివిన ఏ ఒక్కరు మరచిపోలేని దారుణ ఉదంతమది.

ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర ప్రమాదంగా చెర్నోబిల్ అణు విస్పోటం (CHERNOBYL NUCLEAR BLAST) పేరుగాంచింది. ఆనాటి భారీ అణు విషాదానికి 2021 ఏప్రిల్ 26 నాటికి 35 ఏళ్ళు నిండాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ దేశంలోని ప్రిప్యాత్‌ పట్టణం దగ్గర చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో 1986 ఏప్రిల్‌ 26న అర్ధరాత్రి దాటాక 1:23 గంటలకు నిర్వహించిన ప్రయోగం వికటించి భారీ పేలుడు సంభవించింది. విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు చేపట్టిన ప్రయోగం విఫలమైంది. ఫలితంగా అణు రియాక్టర్ పేలిపోయింది. రేడియో ధార్మికత వల్ల 134 మందికి తీవ్రమైన అస్వస్థత కలిగింది. వారిలో 28 మంది కొన్ని నెలల వ్యవధిలోనే మరణించారు. ఆ తర్వాత మరో 19 మంది మృతి చెందారు. చెర్నోబిల్ నుంచి వెలువడిన రేడియో ధార్మికతతో కూడిన పొగ, వ్యర్థాలు గాల్లో కలిసిపోయి ఐరోపా వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించాయి. దాంతో ఆ ప్రాంతాన్ని సురక్షితంగా తీర్చిదిద్దేందుకు, ప్రజల్లో ఉన్న భయాన్ని పొగొట్టేందుకు ఉక్రెయిన్ చర్యలు తీసుకుంది. యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీ కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్తో పాటు అనేక సంస్థలు, దేశాల ఆర్థిక సాయం చేశాయి.

చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో పేలిన రియాక్టర్ నుంచి రేడియేషన్ వెలువడకుండా అడ్డుకునేందుకు ఆ రియాక్టర్‌ను భారీ నిర్మాణంతో కప్పివేశారు నిపుణులు. ఒక‌ప్ప‌టి సోవియట్ యూనియన్‌లో భాగమైన చెర్నోబిల్ ప్రస్తుతం ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతంలో ఉంది. అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో నంబరు రియాక్టర్‌లో కొన్ని వ్యవస్థలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దాంతో రియాక్టర్‌కు కూలింగ్ వాటర్ సరఫరా చేసే టర్బైన్లు నెమ్మదించాయి. ఫలితంగా రియాక్టర్లో ఆవిరి పెరిగింది. దాంతో పీడనం కూడా పెరిగిపోయింది. ఫలితంగా రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. బ‌య‌టి వాతావ‌ర‌ణంలోని గాలి కార‌ణంగా ప‌ది రోజుల పాటు మంటలు చెలరేగాయి. ప్రమాదం అనంతరం చెర్నోబిల్ సమీప ప్రాంతాల నుంచి లక్షా 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ తరలింపు మరికొంత కాలం కొనసాగగా.. రెండో విడతలో రెంగు లక్షల 34 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

చెర్నోబిల్ పేలుడు ఉదంతం జరిగిన అయిదేళ్ళకు సోవియట్ యూనియన్ ముక్కలైంది. చెర్నోబిల్ ప్రాంతాన్ని కలిగి వున్న ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. రేడియో ధార్మికత కలిగిన దేశంగా ముద్ర పడడంతో దాన్ని తొలగించుకునేందుకు ఉక్రెయిన్ చాలా చర్యలు తీసుకుంది. యూరప్ దేశాలతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల సాయాన్ని పొందింది. తాము తీసుకున్న చర్యల కారణంగా చెర్నోబిల్ ప్రాంతం ప్రస్తుతం సురక్షితంగా మారిందని ఉక్రెయిన్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పర్యాటకు ఎలాంటి భయం లేకుండా చెర్నోబిల్ ప్రాంతంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చని చెబుతూ పర్యాటకులను ఆహ్వానిస్తోంది. అక్కడ పర్యాటకులకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది. దాంతో చెర్నోబిల్ ఆ దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల జాబితాలో చేరిపోయింది.

ప్రస్తుతం పరిస్థితి మారిందో లేదో కానీ.. ఆనాటి ప్రభావం తాలూకు పరిణామాలపై ఎన్నో కథనాలు వచ్చాయి. ఇప్పటికీ చెర్నోబిల్ ప్రాంతంలోలో అణు ధార్మికత ప్రభావం వుందని పర్యావరణ వేత్తలు అంఛనా వేస్తున్నారు. జరిగిన ప్రమాదం చిన్నదే అయినప్పటికీ దాని ప్రభావం కొన్ని కిలోమీటర్ల మేరకు వ్యాప్తి చెందిందని అంటున్నారు. కొన్ని సంవత్సరాల తరబడి అణుధార్మికత ప్రభావం చెర్నోబిల్ ప్రాంతంలో వుండిపోయిందంటున్నారు. దాని నుండి విడుదలయ్యే అణు ధార్మికత అణు బాంబు కన్న ఎక్కువ ప్రభావాన్ని కలిగి వుంటుందని చెబుతున్నారు. ఇప్పటికీ దానిని చల్లబరిచే పనిలోనే నిపుణులున్నారన్నది వారి అనుమానం. చెర్నోబిల్ ఏరియాలో వాతావరణం మొత్తం కలుషితం అయిపోయి రకరకాలు చర్మ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు ప్రబలడంతో జనం ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.

చెర్నోబిల్‌ అణు ప్రమాదం జరిగిన నాటి నుంచి 2021 వరకూ రేడియేషన్‌ వల్ల 9 లక్షల 85 వేల మంది మృతి చెందినట్లు ‘న్యూయార్క్‌ అకాడమి ఆఫ్‌ సైన్సెస్‌’ ఆధ్వర్యంలో రష్యా, బెలారస్‌లకు చెందిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. 2009లో ఒక నివేదిక చెర్నోబిల్‌ అణు ప్రమాదంలో.. హిరోషిమా, నాగసాకిల మీద వేసిన అణు బాంబుల నుంచి విడుదలయిన దాని కంటే నాలుగురెట్లు ఎక్కువ రేడియేషన్‌ విడుదలైందని అంఛనా. లక్ష కిలోమీటర్ల భూ భాగం దీని దుష్ప్రభావానికి గురయిందని పర్యావరణ వేత్తల వెర్షన్. ఆల్ప్స్‌ పర్వతాలు, వేల్స్‌, స్కాటిష్‌ హైలాండ్స్‌ కొండల ప్రాంతాలన్నిటా రేడియేషన్‌ వ్యాప్తి చెందిదని గుర్తించారు. ప్రమాద ప్రాంతానికి దూరంగా ఉన్న స్వీడన్‌, నార్వేలకు సైతం చెర్నోబిల్‌ రేడియేషన్ వ్యాపించినట్లు అంఛనాలున్నాయి. ‌

ALSO READ: మరోసారి కఠినంగా లాక్‌డౌన్? సన్నాహాల్లో కేంద్ర ప్రభుత్వం!

Follow Us