Ali Khamenei: 36 ఏళ్లపాటు సుల్తాన్గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు.. ఖమేనీ ప్రస్థానం ఇదే..
మధ్యప్రాచ్యంలో ఒక శకం ముగిసింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇరాన్ను శాసించిన అత్యంత శక్తివంతమైన నాయకుడి మృతి, ప్రపంచ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతోంది? దీని పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అసలు అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా ఎలా ఎదిగారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

దశాబ్దాల పాటు ఇరాన్ను తన గుప్పిట్లో ఉంచుకున్న సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఒక శకం ముగిసింది. 1989లో ఇస్లామిక్ విప్లవ పితామహుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ మరణానంతరం బాధ్యతలు చేపట్టిన ఖమేనీ, 36 ఏళ్లకు పైగా దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించారు. ఏప్రిల్ 19, 1939న ఇరాన్లోని పవిత్ర నగరం మషద్లో ఒక మతపరమైన కుటుంబంలో ఖమేనీ జన్మించారు. ఆయన తండ్రి జావద్ ఖమేనీ ప్రముఖ ఇస్లామిక్ పండితుడు. మషద్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఖమేనీ, అనంతరం కోమ్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. అక్కడ ఆయన రుహోల్లా ఖొమేనీ బోధనలకు ప్రభావితమై, 1960ల నుండి పహ్లావీ రాజరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో పలుమార్లు జైలు జీవితం కూడా గడిపారు.
అధికారంలోకి..
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఖమేనీ కీలక పాత్రలు పోషించారు. రివల్యూషనరీ కౌన్సిల్ సభ్యుడిగా, డిప్యూటీ రక్షణ మంత్రిగా సేవలందించారు. 1981లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మత గురువు ఆయనే. రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసిన తర్వాత 1989లో సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీం లీడర్గా, ఆయన ఇరాన్ పాలనా వ్యవస్థను మత గురువుల నేతృత్వంలో మరింత పటిష్టం చేశారు. హార్డ్లైన్ మద్దతుదారులు ఆయనను దేవుడి తర్వాత అంతటి శక్తివంతుడిగా భావించేవారు.
సైన్యానికి అధికారులు
రివల్యూషనరీ గార్డ్స్కు అపరిమిత అధికారాలు కట్టబెట్టి.. దేశ అంతర్గత, విదేశీ విధానాల్లో వారిని ప్రధాన శక్తిగా మార్చారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్ వీరి నియంత్రణలోనే ఉంది. ఇరాన్ను సైనికంగా బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా షియా ముస్లింలకు నాయకుడిగా ఎదిగారు. పాలస్తీనాపై ఆయన వైఖరి సున్నీ ముస్లింలలోనూ ఆయనకు ప్రజాదరణ పెంచింది.
ప్రజా వ్యతిరేకత – నిరసనలు
ఖమేనీ పాలనలో ఇరాన్ శక్తివంతమైన దేశంగా ఎదిగినప్పటికీ, అంతర్గత నిరసనలు ఆయన పాలనకు పెద్ద సవాలుగా మారాయి. 2009లో ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. 2017, 2019లో ఆర్థిక ఆంక్షల వల్ల పెరిగిన ధరలపై నిరసనలు వెల్లువెత్తాయి. 2022లో యువతి మరణంతో చెలరేగిన హిజాబ్ వ్యతిరేక అల్లర్లను అణిచివేసే క్రమంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నియంతృత్వ పాలన నుండి తమను రక్షించాలని చాలా మంది ఇరాన్ వాసులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరకు 86 ఏళ్ల వయసులో ఆయన మరణంతో ఇరాన్ రాజకీయాల్లో పెద్ద సంక్షోభం తలెత్తింది.
