Wanaparthy Politics: ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి.. ఇద్దరు నేతల మధ్య సైలెంట్ వార్..!
ఒక్క నియోజకవర్గంలో రెండు వర్గాలతో కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను చేర్చుకోవడంలో ఇరు వర్గాలు పోటీ పడడం రచ్చకెక్కింది. ఆ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే వర్సెస్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి.
ఒక్క నియోజకవర్గంలో రెండు వర్గాలతో కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను చేర్చుకోవడంలో ఇరు వర్గాలు పోటీ పడడం రచ్చకెక్కింది. ఆ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే వర్సెస్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఇతర పార్టీల నుంచి చేరికలు ఆపాలంటూ చిన్నారెడ్డి వర్గం నేతలు ఏకంగా ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన ఘటన ఉమ్మడి జిల్లాలో సంచలనంగా మారింది.
వనపర్తి నియోజకవర్గంలో గత కొంతకాలంగాఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా సాగిన ఇంటిపోరు ఇటీవలే చేరికలకు పార్టీ అధిష్టానం పచ్చజెండా ఊపడంతో రచ్చకెక్కాయి. ఈ ఇద్దరు నేతలు పోటాపోటిగా ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకోవటం పార్టీలో చిచ్చురేపింది. వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య పొరపచ్చలకు వనపర్తి ఎమ్మెల్యే టికెట్ కారణం. మొదట చిన్నారెడ్డిని వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి… చివరి నిమిషంలో మేఘారెడ్డికి మార్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అంతా సైలెంట్ గా ఉన్నప్పటికీ అనంతర పరిణామాలు నియోజకవర్గంలో ఈ ఇద్దరు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నియోజకవర్గంలో ఒకరికొకరు సమాచారం లేకుండా చేరికలు చేపట్టడం తాజాగా వివాదానికి అగ్గి రాజేసింది. ఇటీవలే చేరికల సందర్భంగా ఈ ఇద్దరు నేతల మధ్య సైలెంట్ వార్ ను బహిర్గతం చేసింది. నియోజకవర్గంలోని తాడిపర్తి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల చేరిక కార్యక్రమం నియోజకవర్గ కాంగ్రెస్ లో వివాదంగా మారింది.
అదే ప్రాంతానికి చెందిన చిన్నారెడ్డి వర్గం నేతలకు తెలియకుండా ఎలా పార్టీలోకి ఆహ్వానిస్తారని వివాదం మొదలైంది. ఎమ్మెల్యే మేఘారెడ్డిని కలిసి చేరికల అంశంపై తేల్చుకోవాలని డిసైడయ్యారు. పదేళ్లు అధికారంలో ఉందని తమను కేసులు పెట్టి వేధించిన వారిని పార్టీలో చేర్చుకోవద్దని ఎమ్మెల్యే మేఘారెడ్డితో మాట్లాడుతుండగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చిన్నారెడ్డి వర్గానికి చెందిన గోపాల్ పేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గౌణేష్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. అయితే మిగిలిన వారు అడ్డుకుంటున్న క్రమంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కూడా పెట్రోల్ పడింది. దీంతో అక్కడే ఉన్న మిగిలిన కార్యకర్తలు, గన్ మెన్ లు గణేష్ గౌడ్ ను పక్కకు తీసుకెళ్లీ పోలీసులకు అప్పజెప్పారు.
ఒక్కసారిగా ఈ ఘటన ఎమ్మెల్యే మేఘా రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య ఉన్న వర్గ పోరు కలకలం రేపింది. రోజు రోజుకు ఈ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు పెరుగుతుండడం పార్టీలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ ఇద్దరు నేతలు అభ్యర్థి విజయం కోసం కలిసి పనిచేయకపోతే కష్టమేనన్న భావనలో ఉన్నారట క్యాడర్. అధిష్టానం చొరవ తీసుకుంటుందా లేక అలాగే వదిలేస్తుందా వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…