Kothagudem: ఇంటర్ పరీక్షలు రాస్తూ.. పరీక్షా కేంద్రంలోని వాష్ రూమ్లో ప్రసవించిన బాలిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇంటర్ పరీక్ష రాస్తున్న ఓ మైనర్ విద్యార్థిని పరీక్షా కేంద్రంలోని వాష్రూమ్లో మృత శిశువుకు జన్మనిచ్చింది. అస్వస్థతకు గురైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో వెలగుచూసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఓ మైనర్ బాలిక పరీక్షా కేంద్రంలోని వాష్రూమ్లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. అందుతున్న సమాచారం మేరకు.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ విద్యార్థిని.. ఇన్విజిలేటర్ పర్మిషన్ తీసుకుని వాష్ రూమ్కి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో.. అనుమానంతో వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. వాష్రూమ్కు వెళ్లిన బాలిక అక్కడే ప్రసవించింది. అయితే శిశువు మృతి చెంది జన్మించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన విషయం బయటకు రావడంతో పరీక్షా కేంద్ర సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మైనర్ కావడంతో చట్టపరమైన కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
ఈ సంఘటన సమాజంలో పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. మైనర్ బాలిక ఈ పరిస్థితికి ఎలా చేరుకుంది? అందుకు కారకులు ఎవరు..? కుటుంబ సభ్యులు, పాఠశాల వర్గాలు ఆమె పరిస్థితిని గమనించలేదా? వంటి అంశాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఒకవైపు విద్యార్థిని ఆరోగ్యం పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండగా, మరోవైపు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Also Read: సవారీకి మీరు రెడీనా..? హైదరాబాద్ టూ వైజాగ్ జర్నీ బాగా తగ్గనుంది..
