AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: నాడు హైదరాబాద్‌లో.. నేడు బెంగళూరులో.. 55 ఏళ్ల చెత్త రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ సేన

IND vs NZ 1st Test: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజు వర్షం కారణంగా రద్దైంది. ఇప్పుడు రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా 50 పరుగులు స్కోర్ బోర్డ్‌లో చేర్చకముందే 6 వికెట్లు కోల్పోయింది.

IND vs NZ: నాడు హైదరాబాద్‌లో.. నేడు బెంగళూరులో.. 55 ఏళ్ల చెత్త రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ సేన
Ind Vs Nz 1st Test
Venkata Chari
|

Updated on: Oct 17, 2024 | 1:00 PM

Share

IND vs NZ 1st Test: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగులు చేసి టిమ్ సౌథీ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే విరాట్ కోహ్లీ (0) కూడా సున్నాకే పెవిలియన్ బాట పట్టాడు. శుభమాన్ గిల్ స్థానంలో జట్టులో అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ (0) కూడా సున్నాకే ఔట్ అయ్యాడు.

అంటే కేవలం 13 పరుగులకే భారత జట్టు 3 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఈ ముగ్గురిలో ఇద్దరు డకౌట్ కావడం విశేషం. 12 ఓవర్లు ముగిసే సమయానికి టీమ్ ఇండియా 13 పరుగులు సాధించింది.

ఆ తర్వాత యశస్వి జైస్వాల్ (13), రిషబ్ పంత్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నట్లు అనిపింది. కానీ, జైస్వాల్ కూడా ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (0) భారత జట్టును గట్టెక్కిస్తాడని అనుకున్నారు. కానీ, ఏమాత్రం క్రీజులో నిలవలేక జీరోకే పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా కూడా జీరోకే ఔట్ అవ్వడంతో టీమిండియా లంచ్ సమయానికి 6 వికెట్లకు 34 పరుగులు చేసింది. రిషబ్ పంత్ అజేయంగా 15 పరుగులతో నిలిచాడు.

ఏడుగురిలో ఐదుగురు జీరోకే ఔట్..

లంచ్ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్ కూడా జీరోకే పెవిలియన్ చేరాడు. దీంతో మొత్తం 7 వికెట్లలో ఐదుగురు జీరోకే పెవిలియన్ చేరడం గమనార్హం.

55 ఏళ్ల తర్వాత చెత్త రికార్డ్..

ఈ క్రమంలో టీమిండియా 55 ఏళ్ల తర్వాత చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంటే 6 వికెట్లు పడిపోయిన సమయంలో కేవలం 34 పరుగులు చేసి చెత్త రికార్డ్ నమోదు చేసింది. అంతకుముందు అంటే, 1969లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 27 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది.

ఇండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఓరాక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..