Bollywood: నిజంగానే సౌత్ ఇండియా సినిమాలు చూసి బాలీవుడ్ భయపడుతోందా?
Bollywood: భిన్న భాషలతో భిన్న మాండలికాలతో అలరారుతున్న మన దేశానికి అదే బలం. అదే బలహీనత కూడా! విదేశీ భాషలకు తావివ్వకూడదనుకుంటే ఇక్కడ ఓ భాష అవసరం. అందుకే స్వాతంత్య్ర సమరయోధులు హిందీని రాజభాష, అంటే జాతీయ...
Bollywood: భిన్న భాషలతో భిన్న మాండలికాలతో అలరారుతున్న మన దేశానికి అదే బలం. అదే బలహీనత కూడా! విదేశీ భాషలకు తావివ్వకూడదనుకుంటే ఇక్కడ ఓ భాష అవసరం. అందుకే స్వాతంత్య్ర సమరయోధులు హిందీని రాజభాష అంటే జాతీయ భాషగా అమలు చేయాలని ఆకాంక్షించారు. హిందీ దివస్ సందర్భంగా 2019 సెప్టెంబర్ 14న కేంద్ర హోమ్మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు.. అమిత్ షా అలా అన్నారో లేదో దేశవ్యాప్తంగా , ముఖ్యంగా దక్షిణ భారతం నుంచి ప్రతిస్పందనలు ప్రతిధ్వనించాయి. బలవంతంగా హిందీని రుద్దితే ఊరుకునేది లేదంటూ కౌంటర్లు ఇచ్చారు వివిధ పార్టీల నేతలు. దాంతో కేంద్రం సైలెంటయ్యింది.. అయినా హిందీని జాతీయభాషగా చేయాలన్న తపన మాత్రం తగ్గినట్టు లేదు. అందుకే మొన్న మళ్లీ అమిత్షా నోటి నుంచి ఇలాంటి మాటలే వచ్చాయి. ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయం హిందీ భాషేనని, ప్రజలంతా తప్పనిసరిగా హిందీ నేర్చుకోవాలని అన్నారు. అలా అనేసి అగ్గి రాజేశారు.
మరోసారి అమిత్ షా వ్యాఖ్యలను తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకే దేశం ఒకే భాష తెస్తుందేమోనన్న అనుమానంతో దక్షిణాది రాష్ట్రాలు ఎదురుదాడికి దిగాయి. ఇక హిందీనే మన జాతీయ భాష అంటూ బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ చేసిన ట్వీట్తో అగ్గి మరింతగా అంటుకుంది. అది కాస్తా సౌత్ ఇండియన్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్ వరకు వెళ్లింది. హిందీ జాతీయ భాష కానేకాదని కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యకు అజయ్ దేవ్గణ్ స్పందించారు. హిందీ జాతీయభాష కాకుంటే మీరెందుకు మీ చిత్రాలన్నీ హిందీలో డబ్ చేసి నార్త్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు? అంటూ ట్వీటాడు. అక్కడితో ఆగాడా? ఇంకాస్త ముందుకెళ్లి హిందీ మన మాతృభాష అని అనేశాడు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ హిందీనే జాతీయ భాషగా ఉంటుందన్నాడు. వెంటనే సుదీప్ మళ్లీ కౌంటరిచ్చాడు. బ్రదర్ అజయ్.. నేను అన్నదాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. హిందీ భాషపై గౌరవం ఉంది కాబట్టే ఆ భాష నేర్చుకుంటున్నాం. మేము కన్నడంలో ట్వీట్ చేస్తే మీరు చదవగలరా? అని రీట్వీటాడు. వీరిద్దరి మధ్యకు కొందరు సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా వచ్చారు.
సుదీప్ చెప్పిందాంట్లో తప్పేముంది? భాషా ప్రయుక్త రాష్ట్రాలలో మాతృభాషదే సార్వభౌమాధికారం అంటూ కర్నాటక సీఎం బొమ్మై అంటే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిందీ ఎప్పటికీ జాతీయ భాష కాదన్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ట్వీట్ చేస్తూ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ భాషల్లాగే హిందీ కూడా ఒక భాష అని అనేశారు. భారతదేశం పలు భాషల, సంస్కృతుల సమ్మేళనమని, దీనికి భంగం కలిగించే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదంటూ సలహా ఇచ్చారు. 19,500 భాషలున్న దేశంలో అన్నింటికీ సమాన ప్రాధాన్యం ఉందన్నారు కర్నాటక పీపీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. జాతీయ భాష ఒక్కటే ఉండటం భారత్ వంటి వైవిధ్యభరితమైన దేశంలో కుదరదని అభిప్రాయపడ్డారు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.
సుదీప్, అజయ్ల ట్వీట్వార్లో పొలిటికల్ లీడర్లే కాదు, సినిమా నటులు కూడా ఎంటరయ్యారు. సౌత్ సినిమాలు కలెక్షన్ల సునామిని సృష్టిస్తున్నాయి కాబట్టే ఉత్తరాది స్టార్లు అసూయతో రగిలిపోతున్నారని రామ్గోపాల్వర్మ ట్వీట్ చేశారు. ప్రజలను భాష ఐక్యం చేసేందుకు దోహదపడాలే తప్ప విడదీయడానికి కాదంటూ ఓ మంచి మాట చెప్పారు. త్వరలో విడుదల కానున్న రన్ వే 34 వసూళ్లతో బాలీవుడ్ విషయం తేలిపోతుందన్నారు వర్మ. నటి, రాజకీయ నాయకురాలు రమ్య కూడా దీనిపై స్పందించారు. హిందీ జాతీయ భాష కాదన్నారు. కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు హిందీ ప్రాంతాల్లోనూ మంచి వసూళ్లు సాధించాయన్నారు. మీ సినిమాలను మేం ఆస్వాదిస్తున్నట్లే మీరూ మా సినిమాలను ఆస్వాదించండి అంటూ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు.
ఇక లేటెస్ట్గా ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పాయ్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. పుష్ప, కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమా విజయాలు బాలీవుడ్ దర్శకనిర్మాతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించాడు. సౌత్ సినిమాలో కోట్లు కొల్లగొడుతుంటే హిందీ సినిమాలు మాత్రం వందల కోట్లను వసూళ్లు చేయడంలో వెనకబడుతున్నాయని చెప్పారు. ఈమధ్య కాలంలో సౌత్లో ఎన్నో బ్లాక్బస్టర్లు వచ్చాయని, ఇది చూసి హిందీ ఇండస్ట్రీలో పనిచేసే ఫిలింమేకర్స్ భయపడిపోతున్నారని పేర్కొన్నారు. వాళ్లకు ఏం చేయాలో కూడా తోచడం లేదని, ఓ రకంగా ఇది బాలీవుడ్కు గుణపాఠం నేర్పిందని మనోజ్ బాజ్పాయ్ చెప్పుకొచ్చారు. సౌత్ వాళ్లు సినిమా పట్ల ఎంతో ప్యాషన్తో పని చేస్తారని, తీసే ప్రతి సన్నివేశం కూడా ఈ ప్రపంచంలోనే బెస్ట్ సీన్గా ఉండాలన్న తపనతో తీస్తారని సౌతిండియా సినిమాలను ప్రశంసించారు.
మరో నటుడు సోనూసూద్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒకటే భాష ఉందని, అదే ఎంటర్టైన్మెంట్ అని అన్నారు. ‘నువ్వు ఏ పరిశ్రమ వాడివనేది ఇక్కడ అనవసరమని, ప్రేక్షకులకు వినోదం పంచగలిగితే వారు నిన్ను ఆదరిస్తారు. గౌరవిస్తారు’ అని సోనూ సూద్ అన్నారు. దక్షిణాది సినిమాల ప్రభావం భవిష్యత్తు హిందీ సినిమాలపై ఉంటుందన్నారు. ప్రేక్షకుడి అభిరుచిలోనూ మార్పు వచ్చిందని, సినిమాలో కంటెంట్ను కోరుకుంటున్నాడని వివరించారు సోనూ. ఒక మామూలు సినిమా చూడటానికి వేల రూపాయలు పెట్టి టికెట్ కొనాలనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Acharya Movie Review: ఆచార్య అంచనాల సంచలనాలను అందుకున్నాడా.? మెగా మూవీ ఎలా ఉందంటే..
ప్రపంచంలోనే వెరీ స్పెషల్ ఫ్యామిలీ !! గిన్నిస్ బుక్లో చోటు !!