పల్లె నుంచి పట్నం దాకా..! తిన్నారో.. చచ్చారే! టీవీ9 నిఘాలో బయటపడ్డ జంతు ఆయిల్ దందా!
ఎవరికి వాళ్లు.. సమర్ధించుకోడానికో మాట చెబుతుంటారు. ఒక్కసారి తింటే ఏమవుతుందిలే అని. 2024 నవంబర్లో నిర్మల్ జిల్లాలో చికెన్ ఫ్రైడ్ రైస్ తిని ఓ యువతి చనిపోయింది. జస్ట్ 19 ఏళ్ల వయసే ఆ అమ్మాయిది. రాళ్లైనా అరిగించుకునే వయసు కదా! ఎందుకు చనిపోయింది మరి? ఇక్కడే కాదు.. వేరే రాష్ట్రాల్లోనూ జరిగాయ్ ఇలాంటివి. 2024 మేలో కేరళలోని ఓ హోటల్లో 'కుజిమంతి' అనే బిర్యానీ తిని ఓ మహిళ చనిపోయింది. 178 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. ఒక్కసారే కదా.. తింటే ఏమవుతుందిలే అని తిన్న వాళ్లే వాళ్లంతా. ఎందుకైంది అలా? ఆ వంటల్లో వాడిన నూనే కారణం. అలా మరణించిన వాళ్లలో మనవాళ్లుండొద్దనే కోరుకుంటాం కదా. అందుకే, ఈ ప్రయత్నం..!

వీధుల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ తింటూ తిరిగే ఆవులు, గేదెలు చూస్తుంటాం. అవి చనిపోయాక ఏమవుతాయి..? గెస్ చేయగలరా. కళాయిలో వేగుతుంటాయే మిర్చి బజ్జీలు.. ఆ నూనెగా మారతాయి. రోగమొచ్చిన జంతువులు, చివరికి రోగంతో చచ్చిన జంతువులను కూడా కొనుక్కునే వాళ్లుంటారు. ఎక్కడికెళ్తాయి అవి? బిర్యానీ పాయింట్లో తినే చికెన్ లెగ్ పీస్, ఆ రైస్.. అలా చచ్చిన జంతువుల కొవ్వు నూనెలో మునిగితేలి వచ్చినవే. మటన్ కొట్టుకెళ్తే.. ఎముకలని ఓ పక్కకి పడేస్తుంటాడు. రాత్రికి వాటినీ అమ్మేస్తాడు. అలా రోజుకు లక్షల క్వింటాళ్ల ఎముకలు చీకట్లో ప్రయాణం చేసి ఎటుపోతున్నాయి? ఫ్రైడ్ రైస్, నూడిల్స్ చేసే ముందు నల్లటి కళాయిలో ఇంతింత నూనె పోసి, అందులో తాళింపు వేస్తాడే.. ఆ నూనె ఈ ఎముకలను కరిగించి తీసినవే. ఊరుకోండి.. మరీ దారుణంగా చెబుతున్నారు. ఎక్కడో ఒకట్రెండు చోట్ల జరిగితే.. అన్నిచోట్లా ఇలాగే జరుగుతున్నట్టు చెబుతున్నారు అని అనాలనుకుంటున్నారేమో..! కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ దందా ఎంత పెద్దదో విజువల్ రికార్డింగ్స్ ఉన్నాయి. అందులో ఒకడు చెబుతుంటాడు.. ‘ఇవన్నీ ఫాస్ట్ఫుడ్ సెంటర్లకి, రోడ్ సైడ్ బిర్యానీ పాయింట్లకి అమ్ముతుంటారు కదా’ అని అడిగితే.. లేదు లేదు పెద్ద పెద్ద హోటల్స్కు కూడా సప్లై చేస్తున్నాం అన్నాడు. అసలు.. ఆ తయారీ విధానం చూడాలి మీరు. ఇప్పుడు చూస్తారు కూడా. అది చూశాక స్ట్రీట్ ఫుడ్పై మీ అభిప్రాయమే మారిపోవచ్చు. ఇదెక్కడి నూనెరా దేవుడా అని...
