PM Modi: మన సమాజంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు.. సీజేఐ గవాయ్తో మాట్లాడిన ప్రధాని మోదీ..
సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గవాయ్పై కిశోర్ రాకేశ్ అనే లాయర్ షూతో దాడి చేయడానికి ప్రయత్నిండం తీవ్ర కలకలం రేపింది. సనాతన ధర్మాన్ని జస్టిస్ గవాయ్ అవమానించారని ఆరోపిస్తూ దాడికి ప్రయత్నించాడు కిశోర్. బార్ కౌన్సిల్ అతడిని సస్పెండ్ చేసింది. విచారించిన తరువాత పోలీసులు సుప్రీంకోర్టు ఆదేశాలతో కిశోర్ రాకేశ్ను విడుదల చేశారు. కాగా.. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.

సుప్రీంకోర్టులో చరిత్రలో అనూహ్య ఘటన జరిగింది. సాక్షాత్తూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ గవాయ్పై ఓ లాయర్ షూ విసరడం తీవ్ర సంచలనం రేపింది. కేసు విచారణలో భాగంగా వాదనలు జరుగుతుండగా ఓ న్యాయవాది సీజేఐ గవాయ్ పైకి బూటు విసిరేందుకు యత్నించాడు. గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. సీజేఐ గవాయ్పై షూ విసిరిన వ్యక్తిని 71 ఏళ్ల కిశోర్ రాకేశ్గా గుర్తించారు. సనాతన ధర్మాన్ని సీజేఐ అవమానించారని కిశోర్ రాకేశ్ కోర్టులో నినాదాలు చేశారు. కాగా.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాయర్ కిశోర్ రాకేశ్ను సస్పెండ్ చేసింది. ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. చాలాకాలం నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న కిశోర్ రాకేశ్ సడెన్గా ఇలా చేయడంతో తోటి లాయర్లు షాక్కు గురయ్యారు. కిశోర్ రాకేశ్ను విచారించిన తరువాత పోలీసులు విడిచిపెట్టారు. కేసుపెట్టడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నిరాకరించడంతో పోలీసులు విడుదల చేశారు.
కాగా.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పైకి బూటు విసిరేందుకు యత్నించిన ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని.. మన సమాజంలో ఇటువంటి దూషణకరమైన చర్యలకు చోటు లేదు.. ఇది పూర్తిగా ఖండించదగినది.. అంటూ ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గవాయ్ తో మాట్లాడినట్లు ఎక్స్ లో షేర్ చేశారు.
ప్రధాని మోదీ ట్వీట్..
Spoke to Chief Justice of India, Justice BR Gavai Ji. The attack on him earlier today in the Supreme Court premises has angered every Indian. There is no place for such reprehensible acts in our society. It is utterly condemnable.
I appreciated the calm displayed by Justice…
— Narendra Modi (@narendramodi) October 6, 2025
‘‘భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ జీతో మాట్లాడాను. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి దూషణకరమైన చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు జస్టిస్ గవాయ్ ప్రదర్శించిన ప్రశాంతతను నేను అభినందించాను. ఇది న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను నొక్కి చెబుతుంది’’.. అంటూ ప్రధాని మోదీ ఎక్స్లో రాశారు.
కాగా.. ఈ ఘటన అనంతరం ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్నారు. దాడి తరువాత కూడా తన విచారణను కొనసాగించారు. కోర్టులో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




