Kedarnath Helicopter Crash: మరో ఘోర విషాదం.. కేదార్నాథ్లో కుప్పకూలిన హెలికాఫ్టర్! ఏడుగురు మృతి..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో పైలెట్, చిన్నారి సహా మొత్తం ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు..

కేదార్నాథ్, జూన్ 15: అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేదార్నాథ్ సమీపంలో ఆదివారం (జూన్ 15) ఉదయం దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. గౌరికుండ్ – త్రిజుగి నారాయణ్ మధ్య హెలీకాప్టర్ కూలిపోయింది. ప్రాథమిక సమాచారం మేరకు.. ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కారణమని తెలుస్తుంది. కూలిపోయిన హెలికాఫ్టర్ను ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు చెందిన హెలీకాప్టర్గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి SDRF, NDRF బృందాలు చేరుకున్నాయి. డెహ్రాడూన్ నుంచి కేథార్ నాథ్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్కు వెళ్తున్న హెలికాప్టర్ గౌరికుండ్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్, ఓ చిన్నారితో సహా హెలికాఫ్టర్ లోని ఏడుగురు మరణించారు. ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ గమ్యస్థానాలలో ఒకటైన కేదార్నాథ్కు వెళ్లే యాత్రా మార్గానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. విమానంలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారని ప్రాథమిక నివేదికలు నిర్ధారించాయి. అత్యవసర సేవలు, విపత్తు ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకున్నాయి. అప్పటికే హెలికాఫ్టర్ శిథిలాలతో సహా మృతులంతా ఆనవాళ్లులేకుండా అగ్నికి ఆహుతయ్యారు. హెలికాప్టర్ ఆపరేటింగ్ కంపెనీ ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది చార్ ధామ్ యాత్ర సీజన్ కావడంతో ఎత్తైన ప్రదేశాలలో యాత్రికులను చేరవేసేందుకు హెలికాప్టర్ సేవలను వినియోగిస్తుంటారు. తాజాగా హెలికాఫ్టర్ కూలడంతో యాత్రికుల భద్రత గురించిన ఆందోళనలను లేవనెత్తింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








