విరిగిన తలుపు సందులో నుంచి బయటకు దూకేశా.. ఎలా బతికానో నాకే తెలీదు: మృత్యుంజయుడు రమేశ్
ఒక్కోసారి సకాలంలో మెరుపువేగంతో తీసుకునే నిర్ణయాలు పెద్దపెద్ద ప్రమాదాల నుంచి బయటపడేస్తాయి. సరిగ్గా ఇలాంటి సీన్ తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బతికిన ఒకేఒక్క మృత్యుంజయుడు ప్రవాస భారతీయుడు, బ్రిటిష్ వ్యాపారి విశ్వాస్కుమార్ రమేశ్ (40) చేశాడు. అవును.. అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో అతడు చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు దక్కించుకున్నట్లు అహ్మదాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న రమేశ్ మీడియాకు వెల్లడించాడు..

అహ్మదాబాద్, జూన్ 14: అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి గురువారం బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన 38 సెకన్లలో అది పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. అయితే అదే విమానంలో బతికి బయటపడిన రమేష్ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని మీడియాకు వివరించారు.
‘విమానం ఎడమ వైపున ఎమర్జెన్సీ డోరుకు అత్యంత సమీపంలో నేను కూర్చున్న. నా సీటు నెంబర్ 11ఏ. గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజీ భవనం ఢీకొట్టింది. వెంటనే నేను చనిపోయానని అనుకున్నా. కానీ అలా జరగలేదు. బతికే ఉన్నానని గ్రహించిన నేను ఫ్యూజ్లేజ్లో ఓ రంధ్రం కనిపించింది. నేను కూర్చున్న సీటు బెల్ట్ వెంటనే అన్లాక్ చేసి, ఆ రంధ్రంను కాలితోతన్ని అందులో నుంచి బయటకు దూకేశాను. అయితే అది ఎమర్జెన్సీ తలుపా లేదంటే విమానం ఫ్యూజ్లేజ్లో పగిలిన భాగమా అనేది స్పష్టంగా తెలియదు. నా కళ్ల ముందే అంతా క్షణాలలో జరిగిపోయింది. నేను ఎలా బతికానో నమ్మలేకపోతున్నాను. కొన్ని క్షణాలపాటు నేను చనిపోతున్నాననే భావించాను. కళ్లు తెరచి చూస్తూ నా చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నేను బతికే ఉన్నాని తెలుసుకుని అక్కడి నుంచి నడుకుంటూ బయటకు వచ్చాను.. అని రమేష్ తెలిపాడు.
పైగా రమేష్ సీటుకు ముందు సీట్ల కంటే ఖాళీ స్థలం ఉంది. అది అతను తోటి ప్రయాణీకుల కంటే ముందుగానే తప్పించుకోవడానికి అవకాశం కల్పించిందని నిపుణులు అంటున్నారు. విమానంలోని ఇతర ప్రయాణికులు బయటపడలేకపోవడానికి కారణం అది భవనాన్ని ఢీకొన్న తర్వాత అటువైపు హాస్టల్ గోడ అడ్డుగా ఉండడమేనని చెబుతున్నారు. అత్యధిక మొత్తంలో ఇంధనం ఉన్న ఆ విమానంలో దాదాపు బతికి బయటపడటం అసాధ్యం. అలాంటిది ఓ ప్రయాణికుడు స్వల్పగాయాలతో బయటపడటం అదృష్టమని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో కూలిన విమానంలోని 242 మందిలో 241 మంది మృతి చెందారు. ఇక బిజె మెడికల్ హాస్టల్ భవనంలో 33 మంది విద్యార్ధులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 274 మందికి చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కాలిన గాయాలతో మెడికల్ విద్యార్ధులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








