Narayanpet Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు! తెల్లవారుజామున ఘటన
నారాయణపేట జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మక్తల్ మండలం బొందల్ కుంట గ్రామ స్టేజి వద్ద తెల్లవారు జామున గం.5.30లకు NH - 167 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది..

నారాయణపేట, జూన్ 12: నారాయణపేట జిల్లా మక్తల్ స్ట్రింగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మక్తల్ మండలం బొందల్ కుంట గ్రామ స్టేజి వద్ద తెల్లవారు జామున గం.5.30లకు NH – 167 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మందికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బస్సు కర్ణాటక శివమొగ్గ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
కర్ణాటక రాష్ట్రం శివమొగ్గకు చెందిన దుర్గమ్మ ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రయాణికులతో హైదరాబాద్కు బయల్దేరింది. మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లికి చేరుకోగానే గురువారం (జూన్ 12) తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో జక్లేర్ గ్రామాల శివారులోని జాతీయ రహదారి 167 పై నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
నారాయణపేట జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మితిమీరిన వేగంతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 18 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎస్సై భాగ్యలక్ష్మీ రెడ్డి మీడియాకు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఏడు మందిని రాయచూర్, మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రులకు తరలించామని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




