షాకింగ్ సీన్.. కట్నంగా కిడ్నీ అడిగిన మగపెళ్లివారు! ఆ తర్వాత జరిగిందిదే..
పెళ్లైన చాన్నాళ్లకు ఓ మొగుడు గారికి మరోమారు కట్నంపై మనసుమళ్లింది. అంతే భార్యను పిలిచి బైక్, నగదు, నగలు కావాలని అడిగాడు. కుదరకపోతే ఓ కిడ్నీని కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేనా కిడ్నీ కోసం నిత్యం అత్తమామలు, కట్టుకున్నోడు ఆమెను చిత్ర హింసలు పెట్టసాగారు. కట్నం కింద కోడలి కిడ్నీని డిమాండ్ చేసిన ఈ వింత సంఘటన..

పాట్నా, జూన్ 10: మన దేశంలో వరకట్న నిషేధం చట్టం 1961లోనే వచ్చింది. ఈ చట్టం ప్రకారం పెళ్లిళ్ల సమయంలో వరకట్నం అడగటమేకాదు ఇవ్వడం కూడా నేరం. కానీ ఈ చట్టం నాటి నుంచి నేటి వరకు పేపర్లకే పరిమితమైందనడంతో ఏ మాత్రం సందేహం లేదు. దేశంలో బడా బాబుల నుంచి పూరి గుడిసెల వరకు ఎక్కడ ఏ మూల జరిగే పెళ్లిలో అయిన వరకట్నం దందా యదేచ్ఛగా నడుస్తుంది. ఇక కట్నంగా మగ పెళ్లివారి గొంతెమ్మ కోరికలకు హద్దే ఉండదు. కారు, ఇల్లు, బంగారం, బంగ్లాలు, డబ్బు, ఆస్తి.. ఇలా రోడ్డు పక్కన అడ్డుక్కుతినే వారికి ఏ మాత్రం తీసిపోని విధంగా పెద్ద చిట్టానే తయారు చేసుకుని ఆడపెళ్లివారి దుంప తెంచి మరీ వసూలు చేస్తుంటారు. కొన్ని చోట్ల ఈ లావాదేవీలన్నీ రహస్యంగా జరిగితే… మరికొన్ని చోట్ల అదేదో వాళ్ల జన్మహక్కులా రోడ్డెక్కి నానాయాగి చేస్తుంటారు. తాజాగా బీహార్లో వరకట్నం వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లైన చాన్నాళ్లకు ఓ మొగుడు గారికి మరోమారు కట్నంపై మనసుమళ్లింది. అంతే భార్యను పిలిచి బైక్, నగదు, నగలు కావాలని అడిగాడు. కుదరకపోతే ఓ కిడ్నీని కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతేనా కిడ్నీ కోసం నిత్యం అత్తమామలు, కట్టుకున్నోడు ఆమెను చిత్ర హింసలు పెట్టసాగారు. కట్నం కింద కోడలి కిడ్నీని డిమాండ్ చేసిన ఈ వింత సంఘటన బీహార్లోని ముజఫర్పూర్లో జరిగింది. దీనిపై బాధితురాలు దీప్తి.. ముజఫర్పూర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ముజఫర్పూర్లోని బోచాహా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువకుడితో 2021లో దీప్తికి వివాహం జరిగింది. మొదట్లో వివాహం తర్వాత అంతా సవ్యంగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. మానసికంగా హించడంతోపాటు శారీరకంగా దాడి చేశారు. కోడలిని పుట్టింటి నుంచి కట్నంగా బైక్, డబ్బు తీసుకురావాలని డిమాండ్ చేసేవారు. అయితే తాజాగా దీప్తి భర్త కిడ్నీల్లో ఒకటి పాడైనట్లు తేలింది. దీంతో బైక్, నగదు తేలేకపోతే ‘నీ కిడ్నీలలో ఒకదాన్ని నా కొడుక్కి దానం చేయాలి’ అని కోడలిపై ఒత్తిడి తీసుకురాసాగారు. కిడ్నీ ఇచ్చేందుకు దీప్తి నిరాకరించడంతో ఆమెను చావబాది ఇంటి నుంచిగెంటేశారు.
గతిలేని స్థితిలో బాదిత మహిళ పుట్టింటికి చేరి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పెళ్లైన రెండు సంవత్సరాల తర్వాత తన భర్త కిడ్నీ వ్యాధి గురించి తెలిసిందని, తనను కిడ్నీ దానం చేయాలని అత్తమామలు చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలమవడంతో భర్త విడాకులు ఇస్తానని తెగేసి చెప్పాడు. కానీ ఆమె దానికి అంగీకరించలేదు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్లో 38/25 కేసు నమోదు చేసి, అత్తింటివారిలో నలుగురిని నిందితులుగా చేర్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.