Silver Investment Boom: రికార్డుల మీద రికార్డ్ సృష్టిస్తోన్న వెండి ధర.. దీపావళి నాటికి కిలో ఎంతకు చేరుకుంటుందో తెలిస్తే షాక్..
బంగారం తర్వాత ఎక్కువగా కొనడానికి ఆసక్తిని చూపించే లోహం వెండి. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ వెండి చాలా సాధారణంగా ఉపయోగించబడేది.. అయితే ఇప్పుడు వెండిని వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. వెండి కరెన్సీగా, ఆభరణాల తయారీలో, కొన్ని పారిశ్రామిక ప్రక్రియలలో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ముడుపరులు వెండిని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వెండి ధరలు చుక్కలను తాకుతూ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వెండి ధర కిలో ఇప్పుడు లక్ష దాటింది. అయితే దీపావళి నాటికి వెండి ధరలు మరింత పెరగవచ్చని.. దాదాపు రూ. లక్ష 30 వేలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

ఈ రోజుల్లో వెండి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. నిరంతరం రికార్డులను బద్దలు కొడుతున్న వెండి ధరలు.. ఇప్పుడు కొత్త శిఖరాల వైపు కదులుతున్నాయి. ఈ దీపావళి నాటికి వెండి ధర కిలోకు రూ.1.30 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంచనా పెట్టుబడిదారులకే కాదు, సామాన్యులకు కూడా పెద్ద సంకేతం.
కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా ప్రకారం.. దీపావళి వరకు వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ధర రూ. 1 లక్ష 25 వేల నుంచి రూ. 1 లక్ష 30 వేలకు పెరగవచ్చు. దీనికి ప్రపంచ మార్కెట్లో సాంకేతిక పురోగతి అతిపెద్ద కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు $37 స్థాయిని తాకింది. ఇది ఒక ముఖ్యమైన కారణం అంతేకాదు అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం పారిశ్రామిక డిమాండ్ను పెంచింది. క్లీన్ ఎనర్జీ, 5G టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) వంటి పారిశ్రామిక రంగాలలో వెండిని 53-56% వరకు ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా వెండికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.
బంగారం-వెండి నిష్పత్తి ప్రభావం
ప్రస్తుతం బంగారం వెండి నిష్పత్తి 91కి దగ్గరగా ఉందని,.. బంగారంతో పోలిస్తే వెండి ఇప్పటికీ పెట్టుబడికి ఆకర్షణీయంగా ఉందని ఇది చూపిస్తుందని అజయ్ కేడియా అన్నారు. చారిత్రాత్మకంగా ఈ నిష్పత్తి అరుదుగా 90 కంటే ఎక్కువగా ఉంది. అది తగ్గినప్పుడు, వెండి ధరలు పెరుగుతాయి. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ఇటీవల నివేదిక ప్రకారం వెండి సరఫరా తగ్గడంతో పాటు రోజు రోజుకీ వెండికి డిమాండ్ పెరుగడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం. మరోవైపు డిమాండ్ కు తగ్గట్లుగా వెండి సప్లయి లేదు.. ఈ కారణంగా వెండి లోటులో ఉన్న ఐదవ సంవత్సరం ఇది. ఈ లోటు వెండి ధరలను మరింత పెంచింది.
ETFలు, పెరుగుతున్న పెట్టుబడి ఆసక్తి
వెండిలో పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) ముఖ్యమైన పాత్ర పోషించాయి. గతంలో ధన్ తేరస్ లేదా అక్షయ తృతీయ వంటి సందర్భాలలో మాత్రమే వెండిని కొనుగోలు చేసేవారు.. అయితే ఇప్పుడు ప్రజలు వెండిని మంచి పెట్టుబడిగా చూస్తున్నారు. డిజిటల్ వెండి , ETFల ద్వారా తక్కువ మొత్తంలో చిన్న పెట్టుబడిదారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా వెండిని మల్టీ-అసెట్ ఫండ్లలో చేర్చడం ప్రారంభించాయి. ఇది వెండి పెట్టుబడి విషయంలో ప్రజాదరణను పెంచింది.
భవిష్యత్తు గురించిన అంచనా ఏమిటి?
ఈ ఏడాది చివరి నాటికి ముఖ్యంగా దీపావళి నాటికి వెండి ధర కిలోకి రూ.1.30 లక్షలకు చేరుకోవచ్చని కేడియా అంటున్నారు. గత 60 రోజుల్లో వెండి 24% రాబడిని ఇచ్చింది. ఇది ఇతర పెట్టుబడి ఎంపికల కంటే చాలా ఎక్కువ. పారిశ్రామిక డిమాండ్, సరఫరా లేకపోవడం, పెట్టుబడిదారులలో ఆసక్తి పెరుగుతున్న కారణంగా.. వెండి ధరల్లో ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో బంగారం కంటే వెండి రాబడికి మంచి ఎంపికగా పరిగణించబడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇది దీర్ఘకాలిక పెట్టుబడికి ఒక సువర్ణావకాశం. ఈ దీపావళికి మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే.. వెండి ధరలపై దృష్టి పెట్టండి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే వెండి ధర.. దాని రికార్డ్ ని అదే బీట్ చేసే స్టేజ్ కి చేరుకుంటుందని మార్కెటింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇది రికార్డుల తర్వాత రికార్డులను సృష్టించగలదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..