Prashant Kishor: సీఎం కుర్చీ ఇచ్చినా ఆయన కోసం పనిచేయను.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు జాతీయ రాజకీయ వర్గాల్లో నిత్యం వినిపిస్తున్న పేరు. ఇప్పుడు బీహార్ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ కుమార్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా..
ప్రశాంత్ కిషోర్.. జాతీయ రాజకీయ వర్గాల్లో నిత్యం వినిపిస్తున్న పేరు ఇది. ఇప్పుడు బీహార్ రాజకీయాలు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ కుమార్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తుండగా.. తూచ్ అదేమీ లేదు.. బీజేపీ సేవలోనే ఆయన తరిస్తున్నారంటూ జేడీయు నేతలు ఆరోపిస్తున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్వయంగా ఆయన స్పందించారు. జేడీయు చీఫ్ నితీశ్ కుమార్ కోసం తాను పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. నితీశ్ కుమార్ తన సీఎం కుర్చీని తనకు ఇచ్చేందుకు ముందుకు వచ్చినా.. ఆయన కోసం తాను పనిచేయబోనని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ప్రజలకిచ్చిన హామీని తాను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించబోనని స్పష్టంచేశారు. తన పాదయాత్రలో భాగంగా వెస్ట్ చంపారన్ జిల్లా జమునియా గ్రామానికి చేరుకున్న ప్రశాంత్ కిషోర్… అక్కడ తన మద్ధతుదారులనుద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు
ఎన్డీయే నుంచి వైదొలగిన తర్వాత ఆర్డీడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి బీహార్లో నితీశ్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ తర్వాత కూడా నితీశ్ కుమార్పై ప్రశాంత్ కిషోర్ నితీశ్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. యూపీఏలో జేడీయు చేరిన తర్వాత నితీశ్ కుమార్తో ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఆసక్తికర అంశాలను ప్రశాంత్ కిషోర్ మీడియాకు వెల్లడించారు. జేడీయులో మళ్లీ చేరాలని నితీశ్ కుమార్ తనను ఆహ్వానించినట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. సీఎం కుర్చీ తనకు ఇచ్చినా నితీశ్ కుమార్ కోసం తాను పనిచేయలేనని ఆయనకు స్పష్టంచేసినట్లు తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పనిచేస్తున్నారంటూ ఇటీవల జేడీయు ఆరోపించింది. ప్రశాంత్ కిషోర్ పాదయాత్రకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆ పార్టీ నేతలు అనుమానం వ్యక్తంచేశారు. ఐటీ శాఖ, ఈడీ, సీబీఐ ప్రశాంత్ కిషోర్కు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో పట్టించుకోవడం లేదని.. దీని ద్వారా ఆయనకు కేంద్ర ప్రభుత్వ అండదండలున్నాయని తేటతెల్లం అవుతోందని ఆరోపించారు. అటు ఆర్జేడీ నేతలు సైతం బీజేపీ కోసమే ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ వెనుక ఎవరున్నారో చెప్పేందుకు రాకెట్ సైన్స్ అవసరం లేదని.. ఎవరైనా ఈజీగా అర్థంచేసుకోవచ్చని ఆర్జేడీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
వచ్చే బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నిర్ణయాత్మక శక్తి అవుతున్నారన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఆయన్ను ఇటు జేడీయు-ఆర్జేడీ నేతలు.. అటు బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. మరి చివరకు ఆయన ఎవరి వైపు మొగ్గుచూపుతారే కాలమే సమాధానం చెప్పాలి..
మరిన్ని జాతీయ వార్తలు చదవండి