Indian Railways: ప్రైవేటు రైళ్లకై సంప్రదింపులు ముమ్మరం.. త్వరలో బిడ్లను ఆహ్వానించేందుకు ప్రణాళికలు.. కీలక వివరాలివే..
Indian Railways: ప్రభుత్వ సంస్థలన్నింటిలోనూ ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న భారత ప్రభుత్వం.. రైల్వేల్లోనూ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తోంది.

Indian Railways: ప్రభుత్వ సంస్థలన్నింటిలోనూ ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న భారత ప్రభుత్వం.. రైల్వేల్లోనూ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే.. ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి బిడ్లను ఆహ్వానించాలని ఇండియన్ రైల్వే యోచిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గత ఏడాది ఇదే ప్లాన్ విఫలమైన నేపథ్యంలో.. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో 150 కంటే ఎక్కువ ప్యాసింజర్ రైళ్లను నడపటానికి ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బిడ్లను ఆహ్వానించాలని రైల్వే శాఖ ఆలోచిస్తోంది.
కాంట్రాక్టులు పొందిన కంపెనీ ద్వారా ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు అనువైన 100 గమ్యస్థానాలను రైల్వే శాఖ ఇప్పటికే గుర్తించింది. ఇందులోని చాలా గమ్యస్థానాలు గత సంవత్సరం ఆహ్వానించబడిన బిడ్లలోనూ ఉన్నాయి. అయితే, ప్రైవేట్ కంపెనీల నుంచి సరైన స్పందన రాకపోవడంతో నవంబర్లో ఈ ప్రక్రియను రద్దు చేశారు. తాజాగా, ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు ఆసక్తి చూపుతున్న ఇన్వెస్టర్లతో రైల్వే శాఖ సంప్రదింపులు ప్రారంభించింది. అలాగే, రైల్వే శాఖకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎక్కువ మంది బిడ్డర్లను ఆకర్షించేందుకై బిడ్డింగ్ పరిమితులను సర్దుబాటు చేసేందుకు రైల్వే శాఖ సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లకు సంబంధించి సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్ర బడ్జెట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.’ అని రైల్వే శాఖకు చెందిన కీలక అధికారులు తెలిపారు.
గత జూలైలో రైల్వే మంత్రిత్వ శాఖ 109 రూట్లలో ప్రైవేట్ రైళ్లను నడపడానికి ₹ 30,000 కోట్లతో టెండర్ను తెరిచింది. ఈ టెండర్ను 12 క్లస్టర్లుగా విభజించారు. దాదాపు 15 సంస్థల నుంచి 12 క్లస్టర్లకు 120 దరఖాస్తులు వచ్చినప్పటికీ, కేవలం మూడు క్లస్టర్లు మాత్రమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (MEIL) నుండి ఫైనాన్షియల్ బిడ్లను స్వీకరించాయి. ఇక ప్రారంభ ఆసక్తి చూపిన ఇన్వెస్టర్లలో GMR హైవేస్, IRB ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్, క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ III, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి.
Also read:
Viral: రెస్టారెంట్లో వెయిటర్ సర్వీస్కు కస్టమర్ ఫిదా.. ఎంత టిప్ ఇచ్చిందో తెలిస్తే షాకే
Maheshbabu: సూపర్ స్టార్ మహేష్ బాబు పోష్ ఏరియాలో ఖరీదైన ప్లాట్ కొనుగోలు.. ఖరీదు తెలిస్తే షాక్..